అమరావతి: రాజధాని రైతులు, ఉత్తరాంధ్రపై ప్రభుత్వానికి ఎందుకు కక్ష అని టీడీపీ నాయకురాలు పంచుమర్తి అనురాధ ప్రశ్నించారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ కేబినెట్లో రాజధానిపై స్పష్టమైన నిర్ణయం తీసుకోకుండా.. న్యాయనిపుణుల కమిటీతో సంప్రదింపులంటూ కథలు చెబుతున్నారని మండిపడ్డారు. బోస్టన్ గ్రూప్ కమిటీపై ఎఫ్బీఐ కేసులు ఉన్నాయని తెలిపారు. ఏడు నెలల పాలనలో ప్రభుత్వాన్ని 27 సార్లు కోర్టు చీవాట్లు పెట్టిందని గుర్తు చేశారు. పీపీఎ, చంద్రబాబునాయుడు సెక్యూరీటీ, పోలవరం ప్రాజెక్టు, స్విస్ఛాలెంజ్, బందరుపోర్టు భూములు, వ్యవసాయ మార్కెటింగ్ కమిటీలు, విశ్వవిద్యాలయాల నిర్ణయాలు, ఆలయాల బోర్టు రద్దు, ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులు, సౌరపవన్ విద్యుత్తు బకాయిలు, ఆంగ్లమీడియం, జాస్తి కృష్ణకిషోర్, ఇలా 27 విషయాలల్లో చీవాట్లు తిన్నారని, అయిన కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పులేదని విమర్శించారు.
ప్రభుత్వ తప్పులను విమర్శిస్తే వైసీపీ ఎమ్మెల్యేలు వ్యక్తిగతంగా దూషిస్తున్నారని పంచుమర్తి అనురాధ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే మల్లాది విష్ణు కార్పొరేట్గా పోటీ చేసి దారుణంగా ఓడిన విషయం అందరికీ తెలుసని, విష్ణు గురించి బీసెంట్ రోడ్లో ఎవరిని అడిగినా చెబుతారన్నారు. మహిళలపై అసభ్యంగా పోస్టులు పెడితే కఠిన చర్యలుంటాయన్న సీఎం జగన్.. తమ ఎమ్మెల్యేలు అసభ్యంగా మాట్లాడుతుంటే ఎక్కడున్నారని పంచుమర్తి అనురాధ ప్రశ్నించారు.