అమరావతి: ఏపీ రాజధానిపై సీఎం జగన్ మౌనం వీడాలని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వ పాలనలో రాష్ట్ర ప్రతిష్ట ఎంతగా దిగజారిందో కేంద్రం విడుదల చేసిన చిత్రపటమే చెబుతోందంటూ ట్విట్టర్ లో ఓ మ్యాపును పోస్ట్ చేశారు. భారతదేశానికి చెందిన ఈ నూతన చిత్ర పటాన్ని కేంద్ర హోంశాఖ తాజాగా విడుదల చేసింది. అయితే, ఈ చిత్ర పటంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చోటు దక్కలేదంటూ ఓ పత్రికలో వచ్చిన కథనాన్ని రామ్మోహన్ నాయుడు ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.
వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రం ఎంత దిగజారిందో ఈ చిత్రపటమే చెప్తుంది. అసలు మనకి రాజధాని ఉందా లేక అమరావతిని పూర్తిగా బ్రష్టు పట్టిస్తున్నారా? ఇప్పుడు చిత్రపటంలోనే కనపడలేదు, రేపు అసలు ఉంటుందో లేదో అన్న అనిశ్చితి నెలకొంది. ఈ విషయం మీద @ysjagan మౌనం వీడి సమాధానం ఇవ్వాలి#whereismycapital pic.twitter.com/4qMf2ll8i0
— Ram Mohan Naidu #విశాఖఉక్కుఆంధ్రులహక్కు (@RamMNK) November 4, 2019
‘వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రం ఎంత దిగజారిందో ఈ చిత్రపటమే చెబుతోంది. అసలు మనకి రాజధాని ఉందా? లేక అమరావతిని పూర్తిగా భ్రష్టు పట్టిస్తున్నారా? ఇప్పుడు చిత్రపటంలోనే కనపడలేదు, రేపు అసలు ఉంటుందో లేదో అన్న అనిశ్చితి నెలకొంది. ఈ విషయం మీద జగన్ మౌనం వీడి సమాధానం ఇవ్వాలి’ అని రామ్మోహన్ ట్వీట్ చేశారు.
జమ్ముకశ్మీర్ ఇటీవల రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విడిపోయిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన నూతన భారత రాజకీయ చిత్రపటాలను కేంద్ర హోం శాఖ విడుదల చేసింది. దేశంలోని ప్రతి రాష్ట్ర రాజధానిని సూచిస్తూ, వాటి పేర్లను ఎర్రటి అక్షరాల్లో ఇందులో పేర్కొన్నారు. అయితే, ఆంధ్రప్రదేశ్ రాజధానిని గురించి మాత్రం పేర్కొనలేదు.