ముంబై: మహారాష్ట్రలో పూర్తిస్థాయి మంత్రివర్గం కొలువుదీరింది. సోమవారం మధ్యాహ్నం విధాన్ భవన్లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ భగత్సింగ్ కోష్యారీ కొత్త మంత్రులతో ప్రమాణం చేయించారు. ఎన్సీపీ నేత అజిత్ పవార్ ఉపముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. సీఎం ఉద్ధవ్ ఠాక్రే తనయుడు ఆదిత్యకు కూడా కేబినెట్లో చోటు దక్కింది. మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ చవాన్ తో పాటు శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్లకు చెందిన 35 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) నుంచి 14 మంది, కాంగ్రెస్ నుంచి పది మంది, శివసేన నుంచి తొమ్మిది మంది ప్రమాణస్వీకారం చేశారు. కేఎస్పీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేను కేబినెట్ మంత్రిగా, ఒక స్వతంత్ర ఎమ్మెల్యేను సహాయమంత్రిగా తీసుకున్నారు.
ఠాక్రే కుటుంబం నుంచి తొలిసారిగా ఎన్నికల్లో పోటీ చేసిన గెలిచిన ఆదిత్య థాకరే మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఎన్నో దశాబ్దాలుగా మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న ఠాక్రే కుటుంబం నుంచి తొలిసారిగా ఓ వ్యక్తి ప్రత్యక్ష ఎన్నికల్లో బరిలోకి దిగి విజయ ఢంకా మోగించారు ఆదిత్య ఠాక్రే. అసెంబ్లీ ఎన్నికల్లో వర్లీ నుంచి గెలిచిన ఆయన శాసనసభలోకి అడుగుపెట్టారు. అయితే తొలిసారి ఎమ్మెల్యే అయిన ఆదిత్యను కేబినెట్లో తీసుకోవాలని సంకీర్ణ ప్రభుత్వం చివరి నిమిషంలో నిర్ణయించినట్లు తెలుస్తోంది.
మహారాష్ట్ర రాజకీయాల్లో కేంద్ర బిందువుగా మారి.. రాత్రికి రాత్రే అనూహ్య పరిణామాలకు కారణమైన ఎన్సీపీ నేత అజిత్ పవార్ మరోసారి డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. గతంలో బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ నాలుగు రోజుల ప్రభుత్వంలో ఉపముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత పవార్ కుటుంబసభ్యుల ఒత్తిడితో తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. అయితే, ఆయన్ను సంకీర్ణ మంత్రివర్గంలోకి తీసుకుంటారా ? లేదా ? అన్నదానిపై పెద్ద చర్చే జరిగింది. డిప్యూటీ సీఎం పదవి వైపే అజిత్ మొగ్గుచూపినట్లు గతకొంతకాలంగా వార్తలు వినిపించాయి. తాజాగా వాటిని నిజం చేస్తూ మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి సీఎం ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరయ్యారు.
మహారాష్ట్రలో శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ పార్టీలతో కూడిన ‘మహా వికాస్ అఘాడి’ సంకీర్ణ కూటమి ప్రభుత్వానికి ఉద్ధవ్ ఠాక్రే సారథ్యాన్ని వహిస్తున్న విషయం తెలిసిందే. నవంబర్ 28న మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ప్రభత్వం ఏర్పడిన నెల రోజుల తరువాత సీఎం ఉద్ధవ్ పూర్తిస్థాయిలో మంత్రివర్గాన్ని విస్తరించారు.