(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
పశువైద్యురాలు ప్రియాంకరెడ్డి హత్యోదంతంపై ప్రజా సంఘాలు భగ్గుమన్నాయి. ఈ హత్య కేసులో నలుగురు నిందితులను శనివారం షాద్నగర్ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. నిందితులను ఉరిశిక్ష వేయాలంటూ షాద్నగర్ పోలీస్ స్టేషన్ ఎదుట ప్రజా సంఘాలు ఆందోళనకు దిగాయి. దీంతో షాద్నగర్ పోలీసు స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ప్రజా సంఘాల నాయకులు, విద్యార్థులు రోడ్డుపై ధర్నాకు దిగారు. నిందితులను తమకు అప్పగించాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య తోపులాట జరిగింది. షాద్నగర్ పోలీస్ స్టేషన్ వద్ద పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. నలుగురు నిందితులకు వైద్యపరీక్షలు నిర్వహించారు. అనంతరం అక్కడి నుంచి మహబూబ్ నగర్ ఫాస్ట్ ట్రాక్ పోలీస్ స్టేషన్ కు తరలించబోతున్నారు.
మరోవైపు ప్రియాంక హత్య కేసులో షాద్నగర్ బార్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. నిందితులకు ఎవరూ న్యాయ సహాయం చేయకూడదని తీర్మానించారు. నిందితుల తరపున ఏ న్యాయవాది కూడా వాదించొద్దని షాద్నగర్ న్యాయవాదులు విన్నవించారు. నిందితులకు కఠినంగా శిక్షపడే విధంగా న్యాయపోరాటం చేస్తామని లాయర్లు తెలిపారు.
ప్రియాంక రెడ్డి హత్యాచారం కేసుపై నలుగురు నిందితులు మాత్రమే ఉన్నారని శంషాబాద్ డీసీపీ ప్రకాశ్ రెడ్డి తెలిపారు. ఐదో నిందితుడు ఉన్నట్లు వస్తోన్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు. తాము కోర్టుకి అన్ని ఆధారాలు సమర్పించి నిందితులకు కఠిన శిక్ష పడేలా చూస్తామని చెప్పారు.