అమరావతి: రాజధాని అమరావతి ప్రాంతానికి చెందిన పలువురు రైతులు మంగళవారం సీఎం జగన్తో భేటీ అయ్యారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) ఆధ్వర్యంలో నిడమర్రు, ఉండవల్లి, పెనుమాక, తాడేపల్లి గ్రామాలకు చెందిన పలువురు రైతులు సీఎంతో సమావేశమయ్యారు. జగన్ తో భేటీ ముగిసిన అనంతరం ఎమ్మెల్యే ఆర్కే మీడియాతో మాట్లాడారు.
బలవంతపు భూసేకరణ నుంచి తమ గ్రామాలకు మినహాయింపు కల్పించాలని రైతులు సీఎం జగన్ను కోరాగా సీఎం సానుకూలంగా స్పందించారని చెప్పారు. 10 రోజుల్లో భూసేకరణ ఆదేశాలు ఉపసంహరించాలని అధికారులను ఆయన ఆదేశించినట్లు ఆర్కే తెలిపారు.మంగళగిరి, తాడికొండ నియోజకవర్గాల్లో బలవంతంగా భూసేకరణ చేశారనీ, అయిదు వేల ఎకరాల భూసేకరణ ఆదేశాలను వెనక్కి తీసుకోవాలని సీఎం ఆదేశించారనీ వివరించారు. మంగళగిరి-తాడేపల్లి నీటి పథకాలకు ఎనిమిది కోట్ల రూపాయలు కేటాయించాలని జగన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారని ఆర్కే తెలిపారు.
పలువురు రైతులు మాట్లాడుతూ భూసేకరణ నోటిఫికేషన్లు అన్నీ తొలగిస్తామని సీఎం హామీ ఇచ్చారన్నారని చెప్పారు. రైతుల సమస్యలు పరిష్కరించే బాధ్యత తనదని జగన్ భరోసా ఇచ్చారని తెలిపారు.