(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
అమరావతినే రాజధానిగా కొనసాగించాలని రైతులు చేస్తున్న ఆందోళనలు కొనసాగుతున్నాయి. నేటితో రైతుల నిరసన 16వ రోజుకు చేరింది. గురువారం మందడం, తుళ్లూరుల్లో రైతులు మహాధర్నాలు చేస్తున్నారు. వెలగపూడి, ఎర్రబాలెం, కృష్ణాయపాలెంలో 16వ రోజూ రైతులు రిలే నిరాహారదీక్షను కొనసాగిస్తున్నారు. వెలగపూడిలోని సచివాలయానికి వెళ్లే రహదారిని రైతులు దిగ్బంధించారు. మందడం, తుళ్లూరు, పెదపరిమి గ్రామాల్లో పెద్ద సంఖ్యలో మహిళలు దీక్షలో పాల్గొన్నారు. ‘మూడు రాజధానులు వద్దు ఒక్క రాజధానే ముద్దు’ అని నినదించారు.
జగన్ ఆలోచనలకు అనుగుణంగానే జీఎన్ రావు నివేదిక ఇచ్చారని రైతులు ఆరోపించారు. బూటకపు కమిటీలతో కాలయాపన ఎందుకని ప్రశ్నించారు. అమరావతి గురించి ఏం తెలుసని మంత్రులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని రైతులు ప్రశ్నించారు. సీఎం జగన్ సచివాలయానికి వెళ్లాలంటే వందల మంది పోలీసులు పహారా కాస్తున్నారని, తప్పు చేస్తున్నారు కాబట్టే అంత భయపడుతున్నారని రైతులు విమర్శిస్తున్నారు.
రాజధాని పరిధిలోని ఇతర గ్రామాల్లోనూ నిరసనలు చేపట్టారు. కృష్ణా, గుంటూరు జిల్లాలతోపాటు నేటి నుంచి ప్రకాశం జిల్లాలోనూ రాజకీయపక్షాలు, ప్రజాసంఘాలు రాజధానిగా అమరావతినే కొనసాగించాలని ఆందోళనలు చేపట్టనున్నాయి.