అమరావతిః తిరుమలలో కలకలం రేపిన అన్యమత ప్రచారంపై ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం సీరియస్ అయ్యారు. తిరుమల బస్ టికెట్లపై అన్యమత ప్రచారం దారుణమైన చర్య అని అన్నారు. టికెట్ల వెనుక అన్యమత ప్రచారం అంశంలో ఆర్టీసీ నిర్లక్ష్యం ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఎల్వీ తెలిపారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు జరిపి నివేదిక ఇవ్వాలని ఆర్టీసీ ఎండీని ఇప్పటికే ఆదేశించామని వెల్లడించారు. తిరుమల పవిత్రత కాపాడడం ప్రభుత్వ బాధ్యత అని అన్నారు. తిరుమల క్షేత్రానికి సంబంధించిన తాళపత్ర గ్రంథాల పరిరక్షణ, పునఃముద్రణ అంశాలపైనా చర్చించినట్టు సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం వివరించారు. వేదిక్ యూనివర్శిటీ ఆధ్వర్యంలో వీటి శాస్త్రీయతపై పరిశోధనలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. వీటితోపాటు, ఎండోమెంట్ విభాగం ఉద్యోగులందరి నివాసాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తామని చెప్పారు. సంస్థలో ఉంటూ అన్యమతం స్వీకరిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఏపీ రాజధాని మార్పు గురించి తనకు తెలియదని సీఎస్ అన్నారు.
తిరుమలలో అన్యమత ప్రచారం మరోసారి కలకలం రేపిన సంగతి తెలిసిందే. తిరుపతి నుంచి కొండపైకి వెళ్లే ఆర్టీసీ బస్సు టికెట్ల వెనక భాగంలో ముస్లింల పవిత్ర హజ్ యాత్ర, క్రిస్టియన్ల పవిత్ర జెరూసలేం యాత్రకు సంబంధించిన యాడ్స్ దర్శనమిచ్చాయి.ఏపీ ప్రభుత్వానికి చెందిన ఈ ప్రకటనలపై శ్రీవారి భక్తులతోపాటు బీజేపీ, హిందూ సంఘాలు భగ్గుమన్నారు.
previous post
next post