(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి: పట్టణ ప్రాంతాల్లోని గృహ నిర్మాణాలకు సంబంధించి టిడ్కో నిర్వహించిన రివర్స్ టెండరింగ్ ప్రకియ ద్వారా ప్రభుత్వానికి 392.23 కోట్ల రూపాయల ప్రజాధనం ఆదా అయిందని మున్సిపల్ శాఖ మంత్రి బొత్సా సత్యనారాయణ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
విశాఖ పట్టణం, శ్రీకాకుళం జిల్లాలో ప్రతిపాదించిన 5088 యూనిట్ల నిర్మాణాలకు 306.61 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో రివర్స్ టెండరింగ్ నిర్వహించగా డిఇసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థ 275.7 కోట్ల రూపాయలకు ఈ పనులను చేపట్టడానికి ముందుకు వచ్చి బిడ్ దాఖలు చేసి ఎల్ 1 గా నిలిచిందన్నారు. ఈ ప్యాకేజిలో 30.91 కోట్ల రూపాయల మేర ప్రభుత్వ ఖజానాపై భారం తగ్గిందని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఆలోచనలకు అనుగుణంగా ప్రభుత్వ ఖజానాపై భారం తగ్గించడానికి నిర్వహిస్తున్న రివర్స్ టెండరింగ్ ప్రక్రియతో టిడ్కో లో సత్ఫలితాలు సాధించామని ఆయన వెల్లడించారు.
ఇంత వరకు మొత్తం 12 విడతల్లో 63,744 ఇళ్లు నిర్మాణానికి సంబంధించి 3,239.39 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో రివర్స్ టెండరింగ్ ప్రక్రియ నిర్వహించగా 2,847.16 కోట్ల రూపాయలతో ఆ పనులను చేపట్టడానికి వివిధ సంస్థలు సంసిగ్ధత వ్యక్తం చేశాయని బొత్సా వివరించారు.
మొత్తం 12 ప్యాకేజిల్లో చదరపు అడుగు నిర్మాణానికి 156 రూపాయల నుంచి 316 రూపాయల వరకు ఖర్చు తగ్గిందనీ, తద్వారా ప్రభుత్వంపై 392.23 కోట్ల రూపాయల భారం తగ్గిందనీ ఆయన తెలిపారు. వీలైనంత త్వరగా ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసి అర్హులైన లబ్ధిదారులకు అప్పగిస్తామని మంత్రి వెల్లడించారు.