(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అమరావతిపై చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. ఏపీలో నిన్న మొన్నటి వరకు ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశంపై వివాదం జరగ్గా.. ఇప్పుడు రాజధానిని శ్మశానంతో పోల్చడంపై రచ్చ జరుగుతోంది. మంత్రి బొత్స రాజధానిని శ్మశానంతో పోల్చారంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తుంటే.. తన వ్యాఖ్యల్ని తప్పుగా అర్థం చేసుకున్నారని బొత్స చెబుతున్నారు. చంద్రబాబు రాజధాని పర్యటనను ఉద్దేశించి తాను అలా వ్యాఖ్యానించానే తప్ప.. మరో ఉద్దేశం లేదంటున్నారు.
ఏపీ రాజధాని అంశంతో పాటూ చంద్రబాబు అమరావతి పర్యటనపై సోమవారం(నవంబర్ 25) సోమవారం మంత్రి బొత్స సత్యనారాయణ ప్రెస్మీట్లో మాట్లాడారు. బాబు పర్యటనపై విమర్శలు చేసిన బొత్స.. రాజధాని శ్మశానాన్ని చూసి ఏడవడానికి వస్తున్నారా అంటూ ప్రశ్నించారు. ఐదేళ్ల టీడీపీ పాలనలో రాజధానిలో ఏమీ చేయకుండా.. ఇప్పుడు ఎందుకు వస్తున్నారన్న అర్థంలోనే తాను ఆ పదం ఉపయోగించానని మంత్రి వివరణ ఇచ్చారు.
అయితే, బొత్స వ్యాఖ్యలపై టీడీపీ నేతల విమర్శలు గుప్పిస్తున్నారు. ఏపీ రాజధానిని శ్మశానంతో పోలుస్తారా అంటూ ప్రశ్నిస్తున్నారు. సీఎం జగన్ వెంటనే బొత్సను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మాజీ మంత్రి యనమల ఒకడుగు ముందుకేసి బొత్సకు ప్రివిలేజ్ నోటీసులు ఇస్తామన్నారు. ఏపీ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు సైతం బొత్స వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
రాజధాని అమరావతిని ప్రపంచంలోనే అద్భుత నగరంగా తీర్చిదిద్దాలనేది ప్రతి ఆంధ్రుడి ఆకాంక్ష. తెదేపా హయాంలో రూ.52 వేల కోట్ల విలువైన నిర్మాణాలతో, వేలాది కార్మికులతో కళకళలాడుతూ, పర్యాటక జన సందోహంతో నిత్య సందడిగా ఉండేది. అటువంటి సజీవ స్రవంతి అమరావతిని స్మశానంగా శత్రువు కూడా పోల్చరు. (1/3) pic.twitter.com/95ROd4woRg
— N Chandrababu Naidu (@ncbn) November 26, 2019
ఇక మంత్రి బొత్స సత్యనారాయణపై టీడీపీ నేత, మాజీమంత్రి నారా లోకేశ్ తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. ఇన్నాళ్ళూ మంత్రి బొత్సకు మెదడు అరికాల్లో ఉంది అనుకున్నానని… అసలు మెదడే లేదని ఆయన ఇచ్చిన స్టేట్మెంట్తో తేలిపోయిందని వ్యాఖ్యానించారు. శ్మశానాలకు పార్టీ రంగులు వేసుకుంటున్న జగన్… అక్కడే ఆగిపోతారని ఊహించలేదని ఎద్దేవా చేశారు. అందుకే అమరావతిని, శ్మశానంతో పోల్చి ప్రజా రాజధానిని అవమానపరుస్తున్నారని లోకేశ్ మండిపడ్డారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు.
ఇన్నాళ్ళూ బొత్సాగారి మెదడు అరికాల్లో ఉంది అనుకున్నా. అసలు మెదడే లేదని నిన్న ఇచ్చిన స్టేట్ మెంట్ తో తేలిపోయింది. శ్మశానాలకు పార్టీ రంగులు వేసుకుంటున్న @ysjagan గారు అక్కడే ఆగిపోతారని ఊహించలేదు. అందుకే అమరావతిని, శ్మశానంతో పోల్చి ప్రజా రాజధానిని అవమానపరుస్తున్నారు. (1/3) pic.twitter.com/A5EoIvqbdE
— Lokesh Nara (@naralokesh) November 26, 2019
ల్యాండ్ పూలింగ్ దగ్గర నుండి, రైతుల ప్లాట్లు తిరిగి ఇవ్వడం, మౌలిక వసతుల కల్పన వరకూ అన్నీ దేశంలో ఉత్తమ ఆలోచనలుగా ప్రశంసలు అందుకుంటుంటే వైకాపా నేతలు మాత్రం కూర్చున్న చెట్టునే నరికేసుకుంటున్నారు. (3/3)
— Lokesh Nara (@naralokesh) November 26, 2019
మరోవైపు బొత్స వ్యాఖ్యలపై టీడీపీ అనవసరంగా రాద్దాంతం చేస్తోందని వైఎస్సార్సీపీ మండిపడుతోంది. మంత్రి తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చినా ఎందుకు వివాదం చేస్తున్నారని ఆపార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వంపై బురదజల్లేందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని మండిపడుతున్నారు. రాజధాని ప్రాంతంలో భవనాల నిర్మాణంపై సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారనే విషయాన్ని వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు.