(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి ఒకప్పటి తుగ్లక్ లాగా రాజధాని మారిస్తే నిన్నూ అదే పేరుతో పిలుస్తారు. జగన్ రెడ్డి అంటారో లేక పిచ్చి రెడ్డి అంటారో నువ్వే చూడు ఇది ముఖ్యమంత్రిని ఉద్దేశించి కాంగ్రెస్ నేత తులసి రెడ్డి చేసిన వ్యాఖ్య. మూడు రాజధానులన్న ముఖ్యమంత్రి వైఖరిపై ఆయన సోమవారం స్పందించారు.తుళ్లూరుతో మీడియాతో మాట్లాడుతూ, ఒక రాజధాని కట్టడం చేతకాదు కానీ మూడు రాజధానులు కడతాడా అన్నారు.
పవిత్ర దేవాలయం లాంటి అసెంబ్లీ సాక్షి గా జగన్ అమరావతికి అంగీకారం తెలిపారనీ, ఇప్పుడు వెనక్కి వెళ్లడం సరైన పని కాదనీ తులసిరెడ్డి అన్నారు. అమ్మకి అన్నం పెట్టనోడు…పిన్నమ్మకి బంగారు గాజులు చేయిస్తాను అన్నట్లుంది జగన్ వైఖరి అని ఆయన వ్యాఖ్యానించారు.
జగన్ వైఖరి పిచ్చి వాడి చేతిలో రాయిలా ఉందని పులివెందుల ప్రజలే అంటున్నారనీ, పిచ్చి వాడి చేతిలో రాయి కాదు ఏకంగా ఏకే 47 పెట్టారనీ తులసిరెడ్డి పేర్కొన్నారు. ప్రధాన మంత్రి మోదీ శంకుస్థాపన చేసిన అమరావతి మార్చడానికి లేదంటూ, తాజా పరిణామాలను సోనియాగాంధీ దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు ఆయన తెలిపారు.