(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైసిపి గత జూన్ నెలలో అధికారం లోకి వచ్చిన తర్వాత రాజధానిగా అమరావతి కొనసాగింపు అనుమానంలో పడింది. ప్రభుత్వ వైఖరే దానికి కారణం. అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి రాజధాని తరలింపును అడ్డుకోవచ్చన్న భావన చాలమందిలో ఉంది. తాజా పరిణామాలు నిజంగానే బిజెపి చక్రం అడ్డం వేయవచ్చన్న సంకేతాలు ఇస్తున్నాయి. ఇటీవల విడుదల చేసిన భారతదేశం మ్యాప్లో ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి నగరాన్ని చూపించకపోవడం కలవరం సృష్టించింది. దీనిని కేంద్రం సరిచేసి అమరావతి రాజధానిగా చూపిస్తూ కొత్త మ్యాప్ విడుదల చేయడం అమరావతి కొనసాగింపునకు సంకేతమని భావిస్తున్నారు.
గత ఆరు నెలలుగా రాష్ట్రప్రభుత్వంలో బాధ్యత గల మంత్రులు అనేక సందర్భాలలో అమరావతిపై ప్రతికూల వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా మునిసిపల్ పాలనాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అమరావతి విషయంలో ఎంత కంగాళీ చేయవచ్చో అంత కంగాళీ చేశారు. రకరకాల వ్యాఖ్యలతో ఆయన రాజధాని విషయంలో విపరీతమైన అయోమయం సృష్టించారు.
మంత్రులూ, అధికారపక్షం శాసనసభ్యులూ తలొక రకంగా మాట్లాడడం మరింత గందరగోళానికి దారి తీసింది. అమరావతి ప్రస్తావన వచ్చినప్పుడల్లా అభివృద్ధి వికేంద్రీకరణ తమ విధానమని మంత్రులు చెబుతూ వచ్చారు. దానికి అర్ధం ఏమిటో తెలియక ప్రజలు అయోమయానికి గురయ్యారు. ఈలోపు ప్రభుత్వం రాజధాని విషయంలో ప్రజాభిప్రాయం తెలుసుకోవడానికి అంటూ జిఎన్ రావు కమిటీని నియమించింది. దానితో జగన్ ప్రభుత్వం అమరావతి నుంచి రాజధాని తరలింపుకే సిద్ధపడుతోందన్న అభిప్రాయం బలపడింది.
ముఖ్యమంత్రి జగన్ మొదట్లో ఢిల్లీ పర్యటనకు వెళ్లి ప్రధానిని కలిసినపుడు రాజధానికి నిధులు ప్రస్తుతం అక్కరలేదని చెప్పడం కూడా అనుమానాలను పెంచింది. తాజాగా ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి అమరావతి తమ ప్రాధామ్యాలలో లేదని కుండ బద్దలు కొట్టారు.
వైసిపి ప్రభుత్వాన్ని ఈ విషయంలో అడ్డుకునే శక్తి టిడిపికి లేదని భావించిన రాజధాని ప్రాంతం రైతులు బిజెపిని ఆశ్రయించారు. ప్రధాని స్వయంగా శంఖుస్థాపన చేసిన నగరం నుంచి రాజధాని తరలిపోకుండా సెంటిమెంట్ కోసమైనా బిజెపి కేంద్రంతో పావులు కదిపిస్తుందని వారి ఆశ. దానికి తగ్గట్టుగానే రాజధానిని తరలించడం ఎవరి వల్లా కాదని బిజెపి రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి ఇటీవల ప్రకటించారు.
జమ్ము కశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి రద్దు చేసి దానిని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించిన తర్వాత దేశపటంలో ఈ మార్పును ప్రతిఫలించేందుకు సర్వే ఆఫ్ ఇండియా ఇటీవల కొత్త మ్యాప్ రూపొందించి విడుదల చేసింది. దానిలో అసలు నవ్యాంధ్ర రాజధానినే గుర్తించలేదు. దీని పర్యవసానంగా టిడిపి, వైసిపి మధ్య కొంత మాటలయుద్దం కూడా నడిచింది. అమరావతిని టిడిపి ప్రభుత్వం నోటిఫై చేయని కారణంగానే ఇలా జరిగిందని వైసిపి ఆరోపించింది.
తాజాగా టిడిపి ఎంపీ గల్లా జయదేవ్ లోక్సభలో ఈ విషయం ప్రస్తావించారు. వెంటనే హోంశాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి స్పందించి అమరావతిని రాజధానిగా చూపిస్తూ ఇండియా మ్యాప్లు రూపొందించేలా చూశారు. ఈ పరిణామం అమరావతి రాజధానిగా కొనసాగుతుందనడానికి సానుకూల సంకేతమని భావిస్తున్నారు.