విజయవాడ: ప్రభుత్వ పాఠశాలలో నిర్బంధ ఇంగ్లీషు మీడియం ఏర్పాటుపై అసెంబ్లీలో చర్చకు వైసిపి సిద్ధమా అని టిడిపి నేత, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు సవాల్ విసిరారు. శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వైసిపి ప్రభుత్వాన్ని తీవ్ర స్థాయిలో విమర్శించారు.టిడిపి ప్రభుత్వ హయాంలో అన్ని వ్యవస్థలు దెబ్బతిన్నాయని మంత్రి బొగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి విమర్శించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.
ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘నాడు – నేడు’ ప్రోగ్రామ్ ఒక పెద్ద బోగస్ కార్యక్రమమని ఉమా విమర్శించారు. ప్రభుత్వ పాఠశాలలు, గ్రామ పంచాయతీ భవనాలకు, జాతీయ జండాలకు చివరకు మహత్మా గాంధీ విగ్రహాలకు వైసిపి రంగులు వేసుకోవడం తప్ప చేసింది ఏమిలేదని అన్నారు. వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాతే విద్యారంగంలో సమూలమార్పులు తీసుకువస్తున్నామంటూ ప్రచారం చేసుకోవడం తప్ప చేసింది ఏమీలేదని పేర్కొన్నారు.విద్యా వ్యవస్థలో 2016-17లో ఆంధ్రప్రదేశ్ నెంబర్ ఒన్ స్థానంలో ఉందని నీతి ఆయోగ్ ఇచ్చిన రిపోర్టును ఆయన చూపుతూ మంత్రి బుగ్గన ఈ విషయాలను తెలుసుకోవాలన్నారు. సాక్షి పత్రికలో వచ్చిన కథనాలను చూపుతూ ఆయన ఐదేళ్లలో అన్ని వ్యవస్థలు నాశనం అయ్యాయని అవాస్తవాలు మాట్లాడారని అన్నారు.
ఇంగ్లీషు భాష అవసరం గురించి మొదట స్పందించింది టిడిపియేనని ఆయన స్పష్టం చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ‘ఇంగ్లీషు వద్దు – తెలుగు’ ముద్దు అన్నారని గుర్తు చేశారు. అధికారంలోకి రాగానే మాతృభాష వద్దు అంటున్నారని ఉమా పేర్కొన్నారు. ఇంగ్లీషును తామే కనిపెట్టినట్లు మాట్లాడుతున్నారని ఉమా అన్నారు. నిర్బంధ ఇంగ్లీషు మీడియం విషయంలో వైసిపికి రహస్య ఎజండా ఉందంటూ ఉమా ఆరోపించారు.
నిర్బంధ ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టడం వల్ల రాబోయే విద్యాసంవత్సరంలో డ్రాప్ అవుట్స్ పెరిగితే బాధ్యత ఎవరు తీసుకుంటారని ప్రశ్నించారు. 75 శాతం హజరు ఉంటేనే అమ్మ ఒడి పథకం వర్తిస్తుందనీ నిబంధనలు పెట్టారు. మరో పక్క ఉపాధ్యాయులకు ఎటువంటి శిక్షణా ఇవ్వకుండా తగిన ముందస్తు చర్యలు చేపట్టకుండా నిర్బంధ ఇంగ్లీషు మీడియం ప్రవేశపెడుతున్నారు. రేపు విద్యార్థులు తమకు భాష అర్థం కావడం లేదని తరగతులకు హజరుకాకపోతే హజరుశాతం లేదని అమ్మఒడి పథకాన్ని ఇచ్చే పరిస్థితి ఉండదని ఉమా విమర్శించారు.