(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
ఏపీలో అధికార పార్టీ వైసీపీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు బీజేపీతో టచ్లో ఉన్నారంటూ బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. ఇప్పటికిప్పుడు వారంతా పార్టీలో చేరేందుకు సిద్దంగా ఉన్నారని.. అయితే సమయం సందర్భాన్ని బట్టి వారిని పార్టీలో చేర్చుకుంటామని ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ఈ నేపథ్యంలో బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ను మొదలుపెట్టిందా ? లేక మైండ్గేమ్ ఆడుతోందా ? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
అయితే, బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలను వైసీపీ తిప్పికొట్టింది. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండటంతో.. సాధారణంగా నిధులు, ఇతరత్రా పనుల కోసం వైసీపీ ఎంపీలు వారితో టచ్లో ఉండటం సహజమని వైసీపీ నేతలు అంటున్నారు. అంతమాత్రానికే వారంతా బీజేపీలోకి వెళ్లిపోతారని ఊహించుకోవడం భ్రమ అని వ్యాఖ్యానిస్తున్నారు. బీజేపీ నేతలు చెబుతున్నట్టుగా రాజకీయంగా ఆ పార్టీతో ఎవరూ టచ్లో లేరని స్పష్టం చేశారు. అంతేకాదు పరిచయాలు, పలకరింపులను రాజకీయ కోణంలో ముడిపెట్టి చూడవద్దని పేర్కొంటున్నారు. జగన్ నాయకత్వంలో పనిచేయాలన్న కోరిక తప్ప వైసీపీ నేతల్లో మరో ఆలోచన లేదని తేల్చి చెబుతున్నారు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల(2024) నాటికి ఏపీలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పావులు కదుపుతున్న బీజేపీ.. ఆపరేషన్ ఆకర్ష్ పేరిట వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. తమతో టచ్ లో ఉన్న వారిని ఇప్పటికిప్పుడు బీజేపీలో చేర్చుకోబోమని… సమయం, సందర్భం వచ్చినప్పుడే వారిని తమ పార్టీలో చేర్చుకుంటామని సుజనా చౌదరి వ్యాఖ్యల వెనుక ఏదో మాస్టర్ ప్లాన్ ఉందని ప్రచారం జరుగుతోంది. పార్లమెంటులో వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు భుజం మీద చేయి వేసి ‘రాజు గారు’ అంటూ ప్రధాని మోదీ పలకరించడం కూడా చర్చనీయాంశమైంది. ఆయన బీజేపీతో టచ్ లో ఉన్నారనే ప్రచారం గుప్పుమన్నాయి. అయితే, నమస్కారం పెట్టిన వారికి ప్రతినమస్కారం చేయడం మోదీ సంస్కారమని, ఇందులో చర్చించుకోవడానికి ఏమీ లేదని సుజనా చౌదరి చెప్పారు. దీనిపై రకరకాలుగా ఊహించుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు. మొత్తం మీద మైండ్గేమ్తో వైసీపీలో అలజడి రేపడమే బీజేపీ ఉద్దేశంగా కనిపిస్తోంది. అయితే, బీజేపీ నేతలు చెబుతున్నట్లు వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు నిజంగానే ఆపార్టీతో టచ్ లో ఉన్నారా ? లేదా ? అన్నది కాలమే చెప్పాలి.