(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి. పూర్తిస్థాయి ఫలితాలు రాక ముందే అన్ని పార్టీలు క్యాంపు రాజకీయాలు ప్రారంభించాయి. అధికార పార్టీ టీఆర్ఎస్ తమ అభ్యర్థులను ఇప్పటికే బస్సుల్లో క్యాంపులకు తరలించింది. అటు కాంగ్రెస్, బీజేపీ సైతం తమ అభ్యర్థులను క్యాంపులకు పంపింది. ఇప్పటికే హైదరాబాద్ నగరంలోని శివార్లలోని రిసార్టుల్లో అభ్యర్థులు సేదతీరుతున్నట్లు సమాచారం. ఏపీలోని వైజాగ్తో పాటు గోవా, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లోని పర్యాటక ప్రాంతాలకు అభ్యర్థులను తరలించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఫలితాలు వెలువడగానే గెలిచిన కౌన్సిలర్లు, కార్పొరేటర్లను ఈనెల 27న మేయర్లు, చైర్పర్సన్ల ఎన్నిక కార్యక్రమానికి నేరుగా వచ్చేలా పార్టీలు ఏర్పాట్లు చేస్తున్నాయి. అయితే ఈ క్యాంపుల ఖర్చును చైర్మన్, మేయర్ ఆశావాహులు భరించాల్సి ఉంటుందని సమాచారం.
మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో ఊహించిన విధంగానే టీఆర్ఎస్ జోరు కొనసాగుతోంది. ఇప్పటికే చాలా వరకూ మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్ గెలిచింది. శనివారం సాయంత్రానికల్లా 12,926 మంది అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. మొత్తం 9 నగర పాలక సంస్థలు, 120 మున్సిపాలిటీల్లో ఓట్ల లెక్కింపు జరుగుతోంది. భీంగల్, డోర్నకల్ మున్సిపాలిటీలను టీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేసింది. భీంగల్లో ఉన్న 12 వార్డుల్లోనూ విజయం సాధించింది. ఆలంపూర్, మహమూబ్నగర్ జిల్లా కొత్త కోట మున్సిపాలిటీలను టీఆర్ఎస్ గెల్చుకుంది. మేడ్చల్ జిల్లా తూముకుంట మున్సిపాలిటీ, వనపర్తి జిల్లా పెబ్బేరు మున్సిపాలిటీలు టీఆర్ఎస్ వశమయ్యాయి. నిజామాబాద్ జిల్లా భీంగల్, మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మున్సిపాలిటీలను టీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేసింది. భీంగల్లో ఉన్న 12 వార్డుల్లోనూ విజయం సాధించింది. ఆలంపూర్, మహబూబ్నగర్ జిల్లా కొత్త కోట మున్సిపాలిటీలను టీఆర్ఎస్ గెల్చుకుంది. ఇక నారాయణఖేడ్ మున్సిపాలిటీలో ఎక్కువ స్థానాల్లో కాంగ్రెస్ గెలుపొందింది. ఇక్కడ 8 వార్డులు కాంగ్రెస్, 7 టీఆర్ఎస్ కైవసం చేసుకున్నాయి. కొల్లాపూర్ మున్సిపాలిటీలో రెబెల్స్ హవా కొనసాగుతోంది. వీరందరికీ మాజీ మంత్రి జూపల్లి మద్దతుగా ప్రచారం చేసినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. జూపల్లి వర్గీయులంతా క్యాంప్కు తరలించారు.
సత్తుపల్లి, వర్ధన్నపేట, మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్ గెలిచింది. హుజూర్నగర్ 3వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి, సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల ఒకటో వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించారు. నల్గొండ జిల్లా దేవరకొండ 10, 16వ వార్డుల్లో టీఆర్ఎస్ విజయం సాధించారు. దేవరకొండ 13వ వార్డులో బీజేపీ గెలిచింది. వర్ధన్నపేటలోని నాలుగు వార్డుల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచారు. ఇదే మున్సిపాలిటీ ఒకటో నెంబరు వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి గెలిచారు. డోర్నకల్లోని మూడు వార్డుల్లో టీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించారు.
మరోవైపు తెలంగాణ భవన్లో ఎంపీలు, ఎమ్మెల్సీలతో పురపాలక మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. మేయర్, ఛైర్ పర్సన్ పరోక్ష ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చలు జరిపారు. పురపాలక ఎన్నికల సరళిని మంత్రి కేటీఆర్ ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు.