అమరావతి: ఎన్నికల కమిషన్ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి జికె ద్వివేదీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు చంద్రబాబు బుధవారం సచివాలయంలో ద్వివేదీని కలిసి తొమ్మిది పేజీల వినతి పత్రం అందజేశారు.
అలాగే ఏకపక్ష బదిలీలు, టిడిపి నేతలపై ఐటి దాడులపై కేంద్ర ఎన్నికల సంఘానికి రాసిన లేఖను చంద్రబాబు ద్వివేదీకి అందేజేశారు. ఎన్నికల ప్రక్రయ నిష్పక్షపాతంగా జరగాలని చంద్రబాబు ద్వివేదిని కోరారు. చంద్రబాబు వెంట కంభంపాటి, వర్ల రామయ్య, అశోక్ బాబు ద్వివేదిని కలిసిన వారిలో ఉన్నారు.
ద్వివేదితో భేటీ అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని ఒక ముఖ్యమంత్రి కలవడం ఇది తొలిసారి అని చంద్రబాబు అన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని చంద్రబాబు ఆరోపించారు. 22 రాజకీయ పార్టీలు ఎన్నికల సంఘం దగ్గరు వెళ్లి ఈవిఎంలపై నమ్మకం లేదనీ, బ్యాలెట్ పేపర్ పద్దతి ద్వారా పోలింగ్ జరపాలని కోరామని చంద్రబాబు తెలిపారు. అందుకు ఎన్నికల సంఘం నిరాకరిస్తే 50 శాతం వివిపాట్ స్లిప్పులు లెక్కించేలా ఆదేశాలు ఇవ్వాలని సుప్రీం కోర్టును ఆశ్రయించామని చంద్రబాబు తెలిపారు. బ్యాలెట్ పద్ధతిలో ఓట్లను కౌంట్ చేయడానికి ఆరు రోజులు పడుతుందనీ, సుప్రీంకోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చారనీ చంద్రబాబు ఆరోపించారు. చివరికి సుప్రీం కోర్టు ఒక నియోజకవర్గంలో ఐదు వివిప్యాట్లు లెక్కించేలా ఆదేశించిందని చంద్రబాబు పేర్కొన్నారు.
ఎన్నికల సంఘం పరిధిలో లేకున్నా అధికారులను బదిలీ చేశారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఎన్నికల షెడ్యూల్ కంటే ముందు శ్రీకాకుళం కలెక్టర్ను బదిలీ చేశారు. ఇంటిలిజెన్స్ డిజి వెంకటేశ్వర రావు, కడప, శ్రీకాకుళం జిల్లాల ఎస్ పిలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్రా పునేఠాను కూడా ఏకపక్షంగా బదిలీ చేశారు. నిన్న మళ్ళీ ప్రకాశం జిల్లా ఎస్ పిని కూడా బదిలీ చేశారు’ అని చంద్రబాబు వివరించారు. వైకాపా ఇచ్చిన ఫిర్యాదుల మేరకు ఎలాంటి విచారణ జరపకుండా కేంద్ర ఎన్నికల సంఘం ఎలా బదిలీ చేస్తుందని చంద్రబాబు ప్రశ్నించారు.
నంద్యాలలో వైసిపి నేతలు డబ్బు వెదజల్లితే చర్యలు తీసుకున్నారా అని చంద్రబాబు ప్రశ్నించారు . వైసిపి నేతలే ఎన్నికల సంఘం తమకు అనుకూలంగా పనిచేస్తోందని చెబుతున్నారనీ, ఆ ఆడియో టేపులు కూడా బయటపడ్డాయని చంద్రబాబు చెప్పారు. పశ్చిమ బెంగాల్లో తిరస్కరించిన అధికారిని తీసుకొచ్చి, ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల అధికారిగా ఎలా నియమిస్తారని చంద్రబాబు ప్రశ్నించారు.
మరోవైపు ఢిల్లీలో కేంద్ర ఎన్నికల కమిషనర్ను టిడిపి ఎంపి కనకమేడల రవీంద్ర కుమార్ కలిశారు. రాష్ట్రంలో అధికారుల బదిలీపై చంద్రబాబు రాసిన లేఖను ఆయన కేంద్ర ఎన్నికల కమిషనర్కు అందజేశారు. గతంలో టిడిపి చేసిన ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకోవాలని కనకమేడల మరోసారి విజ్ఞప్తి చేశారు.