(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ పదవి కోసం పోటీ పడుతున్న నేతలంతా ప్రస్తుతం ఢిల్లీలో మకాం వేశారు. టీపీసీసీ చీఫ్ మార్పు అంశంపై కొంతకాలంగా చర్చ జరుగుతోంది. ఈ అంశంపై ఇప్పటికే కాంగ్రెస్ అధినాయకత్వం ఒక నిర్ణయం తీసుకుందనే ప్రచారం జరిగింది. అయితే ఈ పదవి కోసం కాంగ్రెస్లో పోటీ ఎక్కువగా ఉండటంతో హైకమాండ్.. నిర్ణయాన్ని వాయిదా వేస్తూ వస్తోంది. ‘భారత్ బచావో’ కార్యక్రమం కోసం ఢిల్లీకి వెళ్లిన పార్టీ నేతలు.. ఇదే అదనుగా లాబీయింగ్ మొదలు పెట్టారని సమాచారం. తమ అనుకూల నాయకుడికి పదవి కట్టబెట్టాలని కొందరు సీనియర్ నాయకులు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పార్టీ అగ్ర నేతలను కూడా కలిసినట్లు ప్రచారం జరుగుతోంది.
మరోవైపు కాంగ్రెస్ ముఖ్య నాయకులంతా ఢిల్లీలోనే ఉండడంతో పీసీసీ చీఫ్ మార్పుపై పార్టీ హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకుంటుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అధ్యక్ష పదవిని ఆశిస్తున్న వారిలో ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, ఎంపీ రేవంత్ రెడ్డి ఢిల్లీలోనే ఉన్నారు. తాను కూడా రేసులో ఉన్నానని గతంలో చెప్పిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉన్నారు. త్వరలోనే ఆయన కూడా ఢిల్లీకి రానున్నారని తెలుస్తోంది. పార్టీ అధినేత్రి సోనియగాంధీ అపాయింట్మెంట్ కోసం చాలా మంది సీనియర్ నాయకులు ప్రయత్నిస్తున్నారు. అయితే, ఎమ్మెల్యే సీతక్క మాత్రం భారత్ బచావో కంటే ముందే సోనియాను కలిశారు. రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉన్న ఆమె.. ఆయనకే పీసీసీ బాధ్యతలు ఇవ్వాలని కోరినట్లు సమాచారం. అయితే, ఈసారి బీసీ వర్గానికి చెందిన నాయకుడికి పీసీసీ పదవి ఇవ్వాలని పార్టీ సీనియర్ నేత వీహెచ్ కోరుతున్నారు.
తెలంగాణలో తర్వలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కొత్త పీసీసీ చీఫ్ ను నియమిస్తారని రాజకీయవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓటమిపాలైంది. దీంతో మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటాలని కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల అనంతరం లేదా, అంతకంటే ముందే కొత్త అధ్యక్షుడిని నియమిస్తారని తెలంగాణ కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి. మొత్తానికి పెండింగ్లో ఉన్న టీపీసీసీ చీఫ్ మార్పు అంశంపై కాంగ్రెస్ నాయకత్వం త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందా లేక మళ్లీ పెండింగ్లో పెడుతుందా అన్నది చూడాలి.