బీజింగ్: ప్రపంచ దేశాలను కలవరపెడుతున్న కరోనా వైరస్ బారిన పడి మరణించిన వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఈ వైరస్ వల్ల మృతి చెందిన వారి సంఖ్య 106కి చేరింది. ఇప్పటి వరకు వ్యాధి కేంద్రంగా ఉన్న వుహాన్ లోనే నమోదైన మరణాలు తాజాగా ఆ దేశ రాజధాని బీజింగ్ కు విస్తరించాయి. సోమవారం బీజింగ్ లో ఈ వైరస్ బారిన పడి ఓ వ్యక్తి మరణించినట్లు అధికారులు తెలిపారు. జనవరి 8న వుహాన్ ను సందర్శించిన 50 ఏళ్ల వ్యక్తి.. ఏడు రోజుల తరువాత బీజింగ్కు తిరిగి వచ్చాడు. అనంతరం వైరస్ కారణంగా జ్వరంతో మరణించాడు. దేశవ్యాప్తంగా వ్యాపించిన ఈ వైరస్.. వుహాన్ తోపాటు ఇతర చైనా నగరాల్లో 2,700 మందికి సోకింది. ఈ మేరకు చైనా ఆరోగ్య శాఖ మంగళవారం ప్రకటించింది. సోమవారం ఒక్క రోజే 24 మంది మృతి చెందినట్లు తెలిపింది.
మరోవైపు ప్రపంచదేశాలకూ ఈ వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. తాజాగా జర్మనీ, శ్రీలంకలో తొలి కేసు నమోదైంది. ఆయా దేశాల్లో చైనా నుంచి వచ్చిన వారిని ప్రత్యేక వార్డుల్లో ఉంచి పర్యవేక్షిస్తున్నారు. భారత్ లోనూ విమానాశ్రయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా చైనా నుంచి వచ్చే వారికి థర్మల్ పరీక్షలు జరుపుతున్నారు. అనుమానితుల్ని వైద్యులు పర్యవేక్షణలో ఉంచుతున్నారు.
ఇదిలావుండగా.. వైరస్ వ్యాప్తి దృష్ట్యా వుహాన్, హుబే ప్రావిన్స్ నుండి 250 మంది భారతీయులను తరలించే విషయమై భారత, చైనా అధికారులు సోమవారం చర్చించారు. చైనా నుండి భారతీయులను తరలించడం గురించి భారత దౌత్యవేత్తలు సోమవారం చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించినట్లు భారత రాయబార కార్యాలయ అధికారులు తెలిపారు.
కరోనా వైరస్ ఇండియాలో వ్యాప్తి చెందకుండా కేంద్ర ప్రభుత్వం, పౌర విమానయాన శాఖ తీసుకుంటున్న చర్యల్లో భాగంగా విశాఖపట్నం విమానాశ్రయంలో హై అలర్ట్ ప్రకటించారు. ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయ్యే ప్రయాణికులు, ముఖ్యంగా విదేశాల నుంచి వచ్చే వారిని పరిశీలించేందుకు ప్రత్యేక స్క్రీనింగ్ సెంటర్ ను ఏర్పాటు చేశారు. కరోనా వైరస్ ఇప్పటికే సోకిన దేశాల నుంచి వచ్చే వారికి ఇక్కడ ప్రత్యేక పరీక్షలు ఉంటాయని అధికారులు వెల్లడించారు. చైనా, దుబాయ్, మలేషియా, సింగపూర్ నుంచి నగరానికి వస్తున్న వారిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని, వారిలో ఎటువంటి కరోనా లక్షణాలు లేకుంటేనే నగరంలోకి పంపుతున్నామని అధికారులు తెలిపారు.
కరోనా వైరస్ నేపథ్యంలో తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ ముందుగానే అప్రమత్తమైంది. ప్రత్యేక వైద్యసహాయాన్ని అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. వివిధ దేశాల నుంచి హైదరాబాద్కు వచ్చే ప్రతీ ప్రయాణికుడికి అధికారులు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. చైనా నుంచి వచ్చిన ప్రయాణికుల్లో కరోనా వైరస్ లక్షణాలు కనిపించిన కారణంగా.. వారికి ప్రత్యేక విభాగంలో చికిత్స అందిస్తున్నారు. అయితే, వీరిలో ఒక వ్యక్తిలో మాత్రమే జలుబు, దగ్గు, జ్వరం లక్షణాలు కనిపించడంతో వైద్యులు అతడి రక్త నమూనాలను సేకరించి పరీక్షల కోసం పూణెకు పంపించారు. పరీక్షల్లో కరోనా వైరస్ లేదని నిర్ధారించే వరకూ కుటుంబసభ్యులు, సన్నిహితంగా ఉండేవారిని ఇళ్లకే పరిమితం చేయాలని ఆదేశాలు జారీచేసింది. ఈ వైరస్ లక్షణాలు కనిపించడానికి సుమారు రెండువారాలు పట్టే అవకాశాలు ఉన్నాయని, ఆలోగా వ్యాధి లేదని బయట తిరిగితే.. ఇతరులకు వ్యాప్తిచెందే ప్రమాదముందని వైద్యులు చెబుతున్నారు.