(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
దిశా హత్యాచారం కేసులో నిందితుల ఎన్ కౌంటర్ తో తమకు న్యాయం జరిగిందిని వెటర్నరీ వైద్యురాలు దిశ తల్లిదండ్రులు అన్నారు. దిశ మరణించిన పది రోజులకు న్యాయం జరిగిందని, ఇందుకు పోలీసులకు, మీడియాకు కృతజ్ఞతలు చెబుతున్నానని తెలిపారు. నిందితుల మరణం తమకు మనశ్శాంతిని కలిగించిందన్నారు. ఇంత తొందరగా తమకు న్యాయం జరుగుతుందని భావించలేదని, నిందితుల మరణంతో ఆమె ఆత్మకు శాంతి కలుగుతుందని చెప్పారు. తన బిడ్డ లేదన్న విషయాన్ని తట్టుకోలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు.
video courtesy: 99tv
దిశా హత్యాచారం కేసులో పారిపోయేందుకు ప్రయత్నించిన నలుగురు నిందితులు మహ్మద్, జొల్లు శివ, చెన్నకేశవులు, నవీన్ లను శుక్రవారం( డిసెంబర్ 6) ఉదయం చటాన్ పల్లి వద్ద పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. షాద్ నగర్లోని చటాన్ పల్లి వద్ద దిశను హత్యాచారం చేశారో..అక్కడే ఈ ఘటన జరగడం గమనార్హం.
దిశను చటాన్ పల్లి సమీపంలో తగులబెట్టిన చోటుకు తీసుకెళ్లి సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తుండగా.. నలుగురు నిందితులు తమ తుపాకులను లాక్కునేందుకు ప్రయత్నించారని పోలీసులు చెబుతున్నారు. తుపాకులను లాక్కోవడం సాధ్యం కాకపోవడంతో పారిపోయేందుకు ప్రయత్నించారని.. అందుకే కాల్పులు జరిపామని తెలిపారు. ఎన్కౌంటర్లో నిందితులు అరిఫ్, శివ, చెన్నకేశవులు, నవీన్ నలుగురూ చనిపోయారని వెల్లడించారు. తెల్లవారుజామున 03.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన తెలుస్తోంది. కోర్టు అనుమతితో చర్లపల్లి జైలు నుంచి నలుగురు నిందితులను తమ కస్టడీలోకి తీసుకున్న మరుసటి రోజే ఈ ఎన్కౌంటర్ జరిగింది. ఈ వార్త నిమిషాల్లో దావానంలా వ్యాపించింది. దిశకు న్యాయం జరిగిందంటూ ప్రజలు నినదించారు. టాలీవుడ్, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు సైతం స్పందిస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా హర్షం వ్యక్తం చేస్తున్నారు.