అమరావతి: రాష్ట్రానికి మూడు రాజధానులుగా కాకుండా ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి మూడు ప్రాంతాలుగా విడగొట్టే ఆలోచన చేస్తే మంచిదని మాజీ మంత్రి, సీనియర్ నేత మైసూరారెడ్డి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దక్షిణాఫ్రికాను ఆదర్శంగా తీసుకొని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి చేస్తున్న మూడు రాజధానుల ప్రతిపాదన నేపథ్యంలో మైసూరా ఈ విధంగా వ్యాఖ్యానించారు. పరిపాలనా వికేంద్రీకరణ విషయంలో జగన్మోహనరెడ్డి ప్రతిపాదన కొంత వరకు ఆమోదయోగ్యమైనప్పటికీ ఏ ప్రాంతం వారు బాధపడకుండా ఉండాలంటే మూడు ప్రాంతాలుగా విడిపోతే మంచిదన్నారు. ఇది కష్టసాధ్యమైన విషయమేమి కాదన్నారు. ఏలాగూ కేంద్రంలోని బిజెపి చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు అనుకూలమే కాబట్టి శాసనసభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపితే ఆ తరువాత బాధ్యత కేంద్రంపై ఉంటుందన్నారు. మూడు ప్రాంతాలుగా విడిపోతే ఎవరి రాజధాని వారికే ఉంటుందన్నారు.
అమరావతిలో అసెంబ్లీ, వైజాగ్లో సెక్రటేరియట్, కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తే తక్కువ ఖర్చుతో మూడు రాజధానులుగా అభివృద్ధి చేయచేయాలని సిఎం జగన్ ఆలోచన అయి ఉండవచ్చని అన్నారు.రాజధానికి భూమిలిచ్చాం కాబట్టి క్యాపిటల్, సచివాలయం, ఇతర కార్యాలయాలు, సంస్థలన్నీ తమ వద్దే ఉండాలని అమరావతి వాసులు కోరడం సబబు కాదని ఆయన అన్నారు. రాజధానికి ఉత్త పుణ్యానికే వారు భూములు ఇవ్వలేదు కదా అని పేర్కొన్నారు. ఎవరైనా భూములిస్తే అభివృద్ధి చేసి ఇవ్వడం సహజంగా జరిగే ప్రక్రియ అని ఆయన అన్నారు. రాజధాని రైతులు భూములిచ్చి త్యాగం చేశామనీ, కాబట్టి ప్రతిదీ తమకే కావాలని కోరుకోవడం స్వార్థపూరిత ఆలోచన అవుతుందనీ మైసూరా అన్నారు. కర్నూలులో ఉన్న రాజధానిని త్యాగం చేశామన్న భావన రాయలసీమ వాసుల్లో ఉందన్నారు.
శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం తమ ప్రాంతంలో రాజధాని, హైకోర్టు ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో బలంగా ఉందనీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి రాయలసీమ నిర్లక్ష్యానికి గురవుతుందన్న భావోద్వేగాలు సీమ వాసుల్లో ఉందనీ ఆయన అన్నారు. రాయలసీమ జిల్లాలతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలను కలుపుకుని గ్రేటర్ రాయలసీమ రాష్ట్రంగా ఏర్పడితే దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా అభివృద్ధి చెందే అవకాశం ఉందని విభజన సమయంలోనే తమ వాదన వినిపించామని గుర్తు చేశారు.
ఒక్క రాయలసీమవాసులే కాకుండా ఉత్తరకోస్తా, ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలు కూడా తమ ప్రాంతాలు అభివృద్ధికి నోచుకోలేదనే అసంతృప్తితో ఉన్నారని మైసూరా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అన్నతమ్ముల మాదిరిగా విడిపోతే మంచిదనీ, ఎవరి రాజధానులు వారికి ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. బంతిని కేంద్రం చేతిలో పెడితే వారే నిర్ణయం తీసుకుంటారనీ, ఆర్టికల్ 3 ప్రకారం చిన్న రాష్ట్రాల ఎర్పాటు సాధ్యమేననీ మైసూరా అన్నారు.