అమరావతి: మూడు రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా అమరావతి పరిధిలోని 29 గ్రామాల రైతుల ఆందోళనలు ఐదో రోజు కొనసాగుతున్నాయి. తూళ్లురులో నిర్వహిస్తున్న మహాధర్నాకు భారీగా ప్రజలు తరలివస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటంతో రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఉద్దండరాయునిపాలెంలో ప్రధాని నరేంద్రమోదీ అప్పట్లో శంకుస్థాపన చేసిన ప్రదేశంలో వంటావార్పు కార్యక్రమం చేపట్టారు. దీంతో పరిస్థితులను అదుపు చేసేందుకు పోలీసులను భారీగా మోహరించారు.
మరోవైపు మందడంలో ప్రధాన రహదారిని రైతులు దిగ్బంధించారు. రోడ్డుపై పడవను పెట్టి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. అయితే, రైతులు పెట్టిన పడవను పోలీసులు బలవంతంగా పక్కకు తప్పించారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. రైతుల దీక్షకు టెంటు వేసేందుకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎండలోనే ధర్నా కొనసాగిస్తున్నారు. టెంటు వేసేందుకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం సాయంత్రం డీఎస్పీ వచ్చి టెంటును తొలగించి ఉదయాన్నే వేసుకోండని చెప్పారని, ఇప్పుడు వేయనీయకుండా అడ్డుకుంటున్నారని రైతులు ఆందోళన చేశారు. టెంటులు ఇస్తే నోటీసులు తప్పవని సప్లయర్స్ వ్యాపారులను బెదిరిస్తున్నారని ఆరోపిస్తూ.. రోడ్డుపై ధర్నా కొనసాగిస్తున్నారు. పోలీసులు వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. రాజధాని కోసం తాతల కాలం నుంచి వస్తున్న భూములను ఇచ్చి త్యాగం చేస్తే మాకు ఇచే బహుమానం ఇదా? అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు మద్దతు ఇస్తున్నవారిని పోలీసులు బెదిరింపులకు గురిచేస్తున్నారని రైతులు ఆరోపించారు.
మందడంలో రైతుల దీక్షకు విట్ వర్సిటీ విద్యార్థులు మద్దతు తెలిపారు. తమ ఉన్నత భవిష్యత్తు కోసమే రైతులు త్యాగాలు చేశారని, ఒక రాజధాని పూర్తికాకుండా మూడు రాజధానులు అభివృద్ధి అసాధ్యమని వారు అంటున్నారు. ప్రభుత్వ తమ నిర్ణయం మార్చుకునే వరకు రైతులకు మద్దతుగా పోరాడతామని స్పష్టం చేశారు. ఇక వెలగపూడిలో చేపట్టిన రిలే నిరాహార దీక్ష ఐదో రోజుకు చేరింది. రైతులు తమ కుటుంబ సభ్యులతో కలిసి దీక్షలో పాల్గొన్నారు. ఉద్ధండరాయునిపాలెంలో ఓ రైతు వినూత్న నిరసన తెలియజేశాడు. రాజధానికి శంకుస్థాపన చేసిన ప్రాంతంలో వంటావార్పు కార్యక్రమాన్ని నిర్వహించగా మెడలో చెప్పుల దండ వేసుకొని తన ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రధాని మోదీ కలుగజేసుకొని సమస్యను పరిష్కరించాలని ఆ రైతు కోరాడు.
ఇదిఇలా ఉంటే.. శనివారం నాడు కొన్ని గ్రామాల్లో పంచాయతీ ఆఫీసులకు వైఎస్ఆర్సీపీ మద్దతుదారులే నల్లరంగులు వేసిన విషయం తెలిసిందే. పోలీసులు అమరావతిలో సెక్షన్ 144ను అమలు చేశారు. అయినా ఆందోళనకారులు వినిపించుకోలేదు. పోలీసులతో వాగ్వాదం, పంచాయతీ ఆఫీసులకు నల్లరంగు వెయ్యటం, నీటి సరఫరా నిలిపివేయటం, వెలగపూడి సచివాలయం బారికేడ్లను దూకేందుకు ప్రయత్నించడం వంటివి చేయడంతో పలువురు రైతులపై పోలీసులు కేసులు నమోదు చేశారు.