విజయవాడ: సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ను టీడీపీ వాడుకొని వదిలేసిందని సంచలన వ్యాఖ్యలు చేసిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ కౌంటర్ ఇచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ను వాడుకుంది కొడాలి నాని, వంశీలే అని వ్యాఖ్యానించారు. వీళ్లకు టికెట్స్ కోసం స్వార్థంతో ఎన్టీఆర్ను వాడుకున్నారని ఆరోపించారు. వీరి కారణంగానే జూనియర్ ఎన్టీఆర్ టీడీపీకి దూరమయ్యారని బోండా ఉమ తెలిపారు. అధికారం ఎటు ఉంటే వారు అటువైపు వెళతారని విమర్శించారు. రాజకీయ అవసరాల కోసమే వంశీ టీడీపీని వీడారని ఆరోపించారు. వంశీకి చంద్రబాబు ఎంపీ టికెట్, రెండుసార్లు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారని గుర్తుచేశారు. వంశీకి ఇప్పుడు మాట్లాడే మాటలు ఆరోజు ఎందుకు గుర్తుకు రాలేదని ప్రశ్నించారు.
ఇటీవల టీడీపీకి రాజీనామా చేసిన గవన్నవం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ.. అనేక అంశాలపై చంద్రబాబు తీరును తీవ్రంగా తప్పుబట్టారు. ఈ క్రమంలోనే సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ అంశాన్ని ప్రస్తావించారు. 2009లో తన ప్రాణాలను ఫణంగా పెట్టి టీడీపీ తరపున ప్రచారం చేసిన జూనియర్ ఎన్టీఆర్… ఆ తరువాత టీడీపీకి ఎందుకు దూరమయ్యారని వల్లభనేని వంశీ చంద్రబాబును ప్రశ్నించారు. పదేళ్ల పాటు టీడీపీకి ఎన్టీఆర్ ఎందుకు దూరంగా ఉన్నారో అంతా ఆలోచించాలని పేర్కొన్నారు. టీడీపీలో జూనియర్ ఎన్టీఆర్ పూర్తిగా నల్లపూసగా మారిపోయారని వల్లభనేని వంశీ అనడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్కు అత్యంత సన్నిహితుల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న వల్లభనేని వంశీ ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. దీంతో వంశీ వ్యాఖ్యలను వర్ల రామయ్యతోపాటు పలువురు టీడీపీ నేతలు తిప్పి కొట్టారు. టీడీపీకి జూనియర్ ఎన్టీఆర్ అవసరం లేదంటూ వ్యాఖ్యలు చేశారు.