అమరావతి: సీనియర్ నాయకుడు, మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదే సందర్భంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు పలు సూచనలు, హెచ్చరికలూ చేశారు.
మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ 57 శాతంకు పైగా ఓట్లతో అధికారంలోకి వచ్చాం, 151 సీట్లు వచ్చాయి, ఇది శాశ్వతం అని భావిస్తే పప్పులో కాలేసినట్టేనని అన్నారు. నవరత్నాల్లో ఏ మాత్రం తేడా వచ్చినా సొంత వారే తిరగబడతారని ఉండవల్లి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి ఉంటే ఢిల్లీలో పరిష్కరించే వారనీ, కానీ వైసిపిలో అన్నీ జగన్ మాత్రమేనని ఉండవల్లి అన్నారు.
ఏపి చరిత్రలో ఎప్పుడూ అత్యధిక మెజార్టీతో ఎవరు అధికారంలోకి వచ్చినా తిరుగుబాట్లు తప్పలేదని ఉండవల్లి గుర్తు చేశారు. వైసిపి అధినేతగా, ముఖ్యమంత్రిగా, పార్టీని, ప్రభుత్వాన్ని నడిపించే వ్యక్తిగా జగన్ ఒక్కరే ఉన్నారనీ, జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందనీ ఉండవల్లి సూచించారు. ప్రజల్లో మంచి పేరుతో పాటు తనతో పాటు గెలిచిన ఎమ్మెల్యేలను సంతృప్తి పర్చడం జగన్ విధి అని ఉండవల్లి అన్నారు.
ఏపి చరిత్రలో రెండు సార్లు ఇదే తరహాలో ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాయని అన్నారు. 1972లో కాంగ్రెస్ పార్టీ 51 శాతం ఓట్లతో సీట్లు సాధించి పివి నర్శింహరావు ముఖ్యమంత్రి అయ్యారని ఉండవల్లి గుర్తు చేశారు. ఆయన భూసంస్కరణలకు తెర తీయగానే ఆయనపై తిరుగుబాటు మొదలయిందని ఉండవల్లి చెప్పుకొచ్చారు. అదే విధంగా 1994లో టిడిపి వ్యవస్థాపకుడు ఎన్టి రామారావు నాడు 213 సీట్లు సాధించి అధికారంలోకి వచ్చారనీ, ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీకి 26 సీట్లు మాత్రమే వచ్చాయన్నారు. సరిగ్గా తొమ్మిది నెలలకే ఊహించని విధంగా చంద్రబాబు తిరుగుబాటుతో ఎన్టిఆర్ పదవీచ్యుతుడయ్యారని ఉండవల్లి వివరించారు.
జగన్ సొంత పార్టీ ఎమ్మెల్యేలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని ఉండవల్లి అన్నారు. వారికి తమ ముఖ్యమంత్రి ప్రాధాన్యత ఇస్తున్నారు, తమ మాటకు విలువ ఇస్తున్నారనే అభిప్రాయం కలిగించకపోతే భారీ నష్టం తప్పదని ఉండవల్లి హెచ్చరించారు. గతం నుండి పాఠాలు నేర్చుకున్న వాడే నాయకుడు అవుతాడనీ, చరిత్రలో జరిగిన రాజకీయ అపశ్రుతులు తెలుసుకోవాలనీ ఉండవల్లి సూచించారు. పాలనలో చిన్న తేడా వచ్చినా కుప్పకూలిపోతారని ఉండవల్లి హెచ్చరించారు.
ప్రభుత్వంపై సీరియస్ ఆరోపణలు చేయడానికి ఇంకా సమయం ఉందని ఉండవల్లి వ్యాఖ్యానిస్తూ ఇసుక కొరత, విద్యుత్ సమస్యలపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని చెప్పారు. ఈ సమస్యలను జగన్ ప్రభుత్వం వెంటనే పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు.
గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి భూ సంస్కరణలు దిశగా తన భూములు ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేస్తే ఆయనపైనా ప్రతిపక్షాలు విరుచుకు పడ్డాయనీ, ఆయన మీద కేసులు పెట్టాలని డిమాండ్ చేశాయని ఉండవల్లి గుర్తు చేశారు. ఇటువంటివన్నీ జగన్ గుర్తు పెట్టుకొని ముందుకు వెళితే భవిష్యత్తు ఉంటుందని ఉండవల్లి హితబోధ చేశారు.
పోలవరం ప్రాజెక్టు పనుల రివర్స్ టెండరింగ్ గురించి ఉండవల్లి మాట్లాడుతూ ఇంత భారీ తేడా వస్తుందని తాను ఊహించలేదనీ, ఆశ్చర్యపోయాననీ అన్నారు. మేఘా కృష్ణారెడ్డి కంపెనీ 700 కోట్ల రూపాయలకు తక్కువగా టెండర్ వేయడం ఆశ్చర్యాన్ని కల్గిస్తోందని ఉండవల్లి అన్నారు. ప్రభుత్వం నిజాయితీగా పని చేసేందుకు ప్రయత్నిస్తుందని ఉండవల్లి కితాబు ఇస్తూ కింది స్థాయిలో అవినీతిని తగ్గించే ప్రయత్నాన్ని చేయాలని సూచించారు.
.