అమరావతి: మతాల మధ్య గొడవ పెట్టేది హిందూ రాజకీయ నాయకులే అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. పవన్ వ్యాఖ్యలను బిజెపి ఎమ్మెల్యే రాజా సింగ్ తీవ్రంగా ఖండించారు. సోమవారం తిరుపతిలో జరిగిన కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ మత విద్వేషాలు రెచ్చగొట్టే వారిలో హిందూ నాయకులే ఎక్కువగా ఉంటారని వ్యాఖ్యానించారు. ఇతర మాతల నేతలు ఇలాంటి పనులు చేయరని పవన్ అన్నారు. విభజించి ఓట్ల రాజకీయం చేస్తున్నారనీ ఆవేదన వ్యక్తం చేశారు. లౌకికవాదానికి తూట్లు పొడిచింది కూడా హిందూ నాయకులేనని పవన్ ఆరోపించారు. టిటిడిలో అన్యమత ప్రచారం చేయిస్తోంది కూడా హిందువులేననీ, హిందూ నాయకుల ప్రేరణ లేకుండా ఇలాంటివి జరగవనీ అన్నారు.
ఈ వ్యాఖ్యలపై తెలంగాణ రాష్ట్రం గోషామహాల్ బిజెపి ఎమ్మెల్యే రాజా సింగ్ స్పందిస్తూ పవన్ వ్యాఖ్యలను వెనక్కుతీసుకోవాలని డిమాండ్ చేశారు. హిందూ మతం,ధర్మం గురించి కనీస అవగాహన లేకుండా పవన్ మాట్లాడుతున్నారని రాజాసింగ్ విమర్శించారు. పవన్ ఏ మతానికి చెందిన వారని, ఇతర మతానికి మారిపోయారా అని ప్రశ్నించారు. హిందూ మతాన్ని టార్గెట్గా చేసి మాట్లాడటం సరికాదని రాజాసింగ్ అన్నారు. పవన్ వ్యాఖ్యలను వెంటనే వెనక్కు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లేకుంటే భవిష్యత్తులో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందనీ, ఖబద్దార్ అంటూ హెచ్చరించారు.
పవన్ వ్యాఖ్యలపై మంత్రి అనిల్ కుమార్ కూడా స్పందించారు. పవన్ రాష్ట్రంలో కుల మతాలను, ప్రాంతీయ తత్వాలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారని అనిల్ అన్నారు. తన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్న నేపథ్యంలో పవన్ ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.