అమరావతి: జనసేన పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధానిపై పవన్ కల్యాణ్ నిర్ణయంతో తనకు సంబంధం లేదన్నారు. పవన్ ఇంట్లోనే రెండు అభిప్రాయాలు ఉన్నప్పుడు.. పార్టీలో రెండు అభిప్రాయాలు ఉండటం తప్పేంటని ఆయన ప్రశ్నించారు. పార్టీ అధినేతగా నిర్ణయం ఆయనదేనని.. తనకు పార్టీ కన్నా ఓట్లేసి గెలిపించిన ప్రజలే ముఖ్యమన్నారు. చిరంజీవి కూడా మూడు రాజధానులను సమర్థించారని.. పవన్ కూడా మూడు రాజధానుల్ని వ్యతిరేకించడం లేదన్నారు. ఎక్కడ పెడతారో స్పష్టం చేయమని అడుగుతున్నారన్నారు. అమరావతి భూములు లాక్కున్నప్పుడు పవన్ ఆందోళన చేశారని గుర్తు చేశారు. ప్రభుత్వాలకు అనుకూలంగా కమిటీల నివేదికలు ఉంటాయని.. హైపవర్ కమిటీ నిర్ణయం కూడా ఇలాగే ఉంటుందనుకుంటున్నానని తెలిపారు. రాజధానులతో సామాన్యులకు పని ఉండదని.. మూడు రాజధానులతో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని రాపాక అభిప్రాయపడ్డారు.
అంతక ముందు.. శనివారం ఉదయం తిరుమలలో ఈ అంశంపై మాట్లాడిన ఎమ్మెల్యే రాపాక.. మూడు రాజధానుల నిర్ణయం సబబే అని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ అభివృద్ధి చెందిందని.. విభజన తర్వాత ఏపీ క్లిష్టమైన ఆర్థిక పరిస్థితుల్లో ఉందన్నారు. ప్రజలకు మేలు జరుగుతుందంటే జనసేన మద్దతు ఇస్తుందన్నారు. హైదరాబాద్లో నిధుల్ని ఎక్కువగా అక్కడే వెచ్చించడంతో ఇతర ప్రాంతాలను నిర్లక్ష్యం చేశారని చెప్పారు. మూడు రాజధానులతో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని చెప్పారు. రాజధాని రైతులకు అన్యాయం జరిగిందని తెలిపారు. గతంలో బలవంతంగా రైతుల దగ్గర భూములు లాక్కున్నారని.. ప్రభుత్వ నిర్ణయంతో వారికి ఇబ్బందేనని చెప్పారు. అమరావతి రైతులకు మేలు జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రాపాక కోరారు. నవరత్నాలు లాంటి సంక్షేమ కార్యక్రమాలతో ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తోందన్నారు. మంచి చేస్తే మద్దతు ఇస్తామని… చెడు చేస్తే వ్యతిరేకిస్తామని రాపాక వ్యాఖ్యానించారు.
ఎమ్మెల్యే రాపాక వ్యవహార శైలి రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పార్టీ అధినేత పవన్ నిర్ణయాలకు భిన్నంగా ఆయన తన వాదన వినిపిస్తున్నారు. రాజధాని మీద ప్రభుత్వం అధకారికంగా నిర్ణయం తీసుకున్న తరువాత తన కార్యాచరణ వెల్లడిస్తానని పవన్ స్పష్టం చేసారు. రాజధాని పైన స్పష్టత ఇవ్వాలని..పాలన మొత్తం ఒకే చోట ఉండాలని పవన్ వాదిస్తుంటే.. రాపాక మాత్రం ముఖ్యమంత్రి నిర్ణయాన్ని సమర్ధిస్తున్నారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని స్వాగతించారు. కొంత కాలంగా ముఖ్యమంత్రి తీసుకుంటున్న ప్రతీ నిర్ణయానికి రాపాక మద్దతు తెలుపుతున్నారు. కొన్ని సూచనలు మినహా అన్నింటినీ సమర్ధిస్తున్నారు. కీలకమైన రాజధాని విషయంలో రాపాక అభిప్రాయం ఏంటో స్పష్టం చేసారు. ఏపీ అసెంబ్లీలో ఇదే అంశంపైన ప్రభుత్వం తీర్మానం ప్రవేశ పెట్టి.. దానికి ఆమోదించే అవకశం ఉంది. రాపాక ప్రభుత్వ నిర్ణయాన్ని సభలోనూ సమర్ధిస్తే..అది జనసేనానికి ఇబ్బందిగా మారే అవకాశం కనిపిస్తోంది.
ఇదిలావుంటే రాపాక వరప్రసాద్ త్వరలో వైసీపీలో చేరతారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రభుత్వాన్ని మెప్పించేలా రాపాక మాట్లాడుతున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇటీవల సీఎం జగన్ జన్మదినం సందర్బంగా రాజోలులో ఏర్పాటు చేసిన వేడుకలకు హాజరైన రాపాక .. జగన్ ఫొటోకు పాలాభిషేకం చేసి స్వీట్లు పంచారు. దాంతో అక్కడున్న వైసీపీ నేతలంతా అవాక్కయ్యారు. ఇటు రాపాక చర్యలను జనసేన కార్యకర్తలు తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఎన్నిసార్లు హెచ్చరించినా రాపాక తీరు మారడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన పార్టీ మారడానికే ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు. అయితే, రాపాక మనసులో ఏముంది ? పార్టీ మారే ఆలోచనలో ఉన్నారా ? అనేది ఉత్కంఠగా మారింది.