అమరావతి: ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న రైతు భరోసా పథకం లబ్ధిదారుల జాబితాలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పేరు ఉండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఐటీ జాబితాలో ఉన్న వారికి ఈ పథకం వర్తించదని ముందుగానే ప్రభుత్వం ప్రకటించింది. ఐదు ఎకరాలకు మించి భూమి లేని వారు, ఆదాయపన్ను కట్టని వారే పథకానికి అర్హులంటూ స్పష్టం చేసింది. అలాంటిది సాక్షాత్తు మంత్రి పేరు జాబితాలో దర్శనమివ్వడంతో అందరు విస్తుపోయారు.
చిన్న సన్నకారు రైతులకు అండగా నిలిచేందుకు ఏపీ ప్రభుత్వం వైఎస్ఆర్ రైతు భరోసా పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ నెల 15 నుంచి రైతు భరోసా పథకం అమలు చేసేందుకు జగన్ సర్కార్ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో వ్యవసాయ శాఖ అధికారులు ఇప్పటికే లబ్ధిదారులను గుర్తించి జాబితాలు రూపొందించారు. అయితే, రైతుల జాబితాలో ఏకంగా మంత్రి ఆదిమూలపు సురేష్ పేరు కనిపించింది. ఆయన్ను లబ్ధిదారుడిగా చేర్చుతూ జాబితా విడుదలైంది. ఒకసారి సర్పంచ్గా పనిచేసినా కూడా అనర్హుడే అంటూ ప్రభుత్వ నిబంధన ఉన్నా.. గతంలో ప్రభుత్వ ఉద్యోగి, ఇప్పుడు మంత్రిగా ఉన్న సురేష్ పేరు ఉండటం విమర్శలకు దారి తీసింది. ఈ విషయం బయటకు రావడంతో అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జాబితాల రూపకల్పనలో ప్రభుత్వ నిబంధనలు పాటించలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆదాయ పన్ను చెల్లిస్తున్న వారి పేర్లు సైతం జాబితాలో ఉండడం, సాక్షాత్తూ రాష్ట్ర మంత్రి ఆదిమూలపు సురేష్ పేరు రైతు భరోసా లబ్ధిదారుల జాబితాలో ఉండడం విమర్శలకు కారణమవుతోంది.
ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం గణపవరంలో మంత్రి సురేష్ పేరిట 94 సెంట్ల భూమి ఉంది. అలాగే కర్నూలు, అనంతపురం జిల్లాల్లో సుమారు 19 ఎకరాల భూమి ఉన్నట్లు మంత్రి సురేష్ తన ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఐదెకరాల కంటే ఎక్కువ భూమి ఉన్నవారికి రైతు భరోసా పథకం వర్తించదని ప్రభుత్వం నిబంధనల్లో పేర్కొంది. అలాంటప్పుడు మంత్రి సురేష్ ఎలా రైతు భరోసా పథకానికి అర్హలవుతారని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఇదిఇలా ఉంటే… రైతు భరోసా పథకానికి ఇప్పటి వరకూ 40 లక్షల మంది రైతులను అర్హులుగా గుర్తించినట్లు గతంలో వ్యవసాయ మంత్రి కన్నబాబు ప్రకటించారు. మరణించిన రైతుల వారసులు 1.07 లక్షల మందికి రైతు భరోసా వర్తింపజేస్తున్నట్లు చెప్పారు. అలాగే ఆదాయ పన్ను చెల్లించే 1.5 లక్షల మందిని అనర్హులుగా తేలిందని, భూములు ఉన్న 21 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్నట్లు చెప్పారు.