మండిపడ్డ మమత, ప్రతిపక్ష నాయకులు
బెంగాల్ ప్రచారం ముందే ఆపడంపై విమర్శ
మమత అరాచకాలను గుర్తించే చర్యలన్న బీజేపీ
న్యూఢిల్లీ: కోల్ కతా నగరంలో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ర్యాలీలో చెలరేగిన హింస నేపథ్యంలో ఎన్నికల సంఘం అక్కడి ప్రచారాన్ని ఒక రోజు ముందుగా ముగించాలని ఆదేశించింది. దీంతో.. అధికార పార్టీ ముందు ఈసీ మోకరిల్లుతోందంటూ ప్రతిపక్షాలు మండిపడ్డాయి. బెంగాల్ ముఖ్యమంత్రిని ప్రధాని మోదీ, అమిత్ షా తదితరులు చాలా ప్రమాదకరంగా లక్ష్యం చేసుకుంటున్నారని బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి ఆరోపించారు. శుక్రవారం సాయంత్రం 5 గంటలకు బదులు గురువారం రాత్రి 10 గంటలకల్లా ప్రచారం ఆపేయాలని ఈసీ ఇప్పటికే చెప్పింది. ఇది అప్రజాస్వామిక, పక్షపాత నిర్ణయమని, సరిగ్గా ప్రధాని మోదీ ర్యాలీలు ముగిసిన తర్వాత నుంచి ప్రచారంపై నిషేధం విధించారని మమత మండిపడ్డారు. గురువారం మోదీ ర్యాలీలు ఉన్నాయనే రాత్రి 10 గంటల వరకు ఈసీ ప్రచారానికి అనుమతించిందని మాయావతి అన్నారు. వాళ్లు కావాలనుకుంటే ఉదయం నుంచే ఎందుకు ఆపలేదని అడిగారు.
ఎన్నికల సంఘం నిర్ణయం ఏమాత్రం క్షమార్హం కానిదని, అది రాజ్యాంగాన్ని మోసం చేయడమేనని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. మోదీ-షాల ద్వయం చేతుల్లో ఎన్నికల సంఘం పావుగా మారిందని విమర్శించింది. ప్రధాని ర్యాలీలకు ఈసీ ఫ్రీ పాస్ ఇచ్చినట్లయిందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా అన్నారు. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ (ఎంసీసీ) కాస్తా మోదీ కోడ్ ఆఫ్ మిస్ కాండక్ట్ గా మారిందా అని ఆయన ప్రశ్నించారు. ఈ విషయంలో తనకు మద్దతుగా నిలిచిన మాయావతి, అఖిలేష్, కాంగ్రెస్, చంద్రబాబు, ఇతరులకు మమతా బెనర్జీ ట్విట్టర్ ద్వారా ధన్యవాదాలు తెలిపారు. ఈసీ పక్షపాత నిర్ణయాలు బీజేపీ సూచనల మేరకు జరిగినేవనని, ఇది ప్రజాస్వామ్యంపై ప్రత్యక్ష దాడి అని, ఇందుకు ప్రజలు తగినవిధంగా సమాధానమిస్తారని అన్నారు.
బెంగాల్ అంతా అరాచకం
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో అంతా అచారకంగా ఉందన్న తమ ఫిర్యాదు సరైనదేనని ఈసీ నిర్ణయంతో తేలిందని బీజేపీ చెప్పింది. ‘‘రాజ్యాంగబద్ధమైన సంస్థ అయిన ఎన్నికల సంఘం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో అరాచకం ఉందన్న విషయాన్ని సమర్ధంగా చెప్పింది. అక్కడ తరచు పేట్రేగుతున్న హింస, ప్రభుత్వ మద్దతుతో కొనసాగుతున్న దొమ్మీలు, పక్షపాతంతో వ్యవహరించే పోలీసులు.. వీటన్నింటినీ ఈసీఐ గుర్తించింది’’ అని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ట్వీట్ చేశారు.
విశేషాధికారాలతోనే చర్యలు
కాగా ఎన్నికల సంఘం తొలిసారి రాజ్యాంగంలోని 324 అధికరణాన్ని ఉపయోగించింది. ఎన్నికల ప్రచారాన్ని నియంత్రించేందుకు తనకున్న విశేషాధికారాలను ఉపయోగించుకుంది. ఇప్పటివరకు ఈ అధికారాన్ని కేవలం ఎన్నికల రద్దు లేదా వాయిదా లేదా అభ్యర్థులను శిక్షించడానికే ఉపయోగించారు. బెంగాల్ ప్రచారాన్ని కుదించడంతో పాటు, ఇద్దరు సీనియర్ అధికారులను తొలగించాలని కూడా ఈసీ ఆదేశించింది.
అమిత్ షాను శిక్షించడానికి బదులు ఈసీ బీజేపీకి బహుమతి ఇచ్చిందని మమత అన్నారు. రాజీవ్, సోనియా, రాహుల్, ప్రియాంక, కేజ్రీవాల్, మాయావతిలతో పాటు తననూ అవినీతిపరులన్నారని, వాళ్లు అలా ఆరోపించని వాళ్లు ఎవరని ప్రశ్నించారు. అయితే పశ్చిమబెంగాల్ లో పోలింగ్ జరిగిన ప్రతి దశలోనూ హింస చెలరేగింది. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా తొలిసారిగా రోడ్ షో నిర్వహించగా అప్పుడూ హింస చెలరేగింది. ఈశ్వర చంద్ర విద్యాసాగర్ విగ్రహం ధ్వంసమైంది. హింసకు కారణం మీరంటే మీరని ఇరు పార్టీలూ పరస్పరం ఆరోపించుకున్నాయి. కుట్రతోనే తన రోడ్ షోను అడ్డుకోడానికి తృణమూల్ ఈ దాడులు చేయించిందని అమిత్ షా ఆరోపించారు. దాన్ని టీఎంసీ నాయకుడు డెరెక్ ఓబ్రెయిన్ ఖండించారు.