తిరుపతి: మతం మార్చుకున్న సీఎం జగన్.. కులాన్ని ఎందుకు వదలటం లేదని ప్రశ్నించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. మతం మార్చుకుంటే ఇంకా కులం ఉండకూడదని వ్యాఖ్యానించారు. తిరుపతి పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్ అక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. జగన్ క్రిస్టియన్ అయితే ఏసులో ఉన్న సహనం, క్షమ గుణాలు ఆయనలో ఎక్కడ ఉన్నాయి ? అని పవన్ ప్రశ్నించారు. జగన్కు ఓట్ల కోసం కులం, మతం, డబ్బు కావాలని దుయ్యబట్టారు. తాను ఓడిపోయాను కానీ పడిపోలేదని పేర్కొన్నారు. వేల కోట్లు సంపాదించుకుని సిమెంట్ కంపెనీలు పెట్టుకోవడానికి రాజకీయాల్లోకి రాలేదని వ్యాఖ్యానించారు. వైసీపీది రంగుల రాజ్యం అని విమర్శించారు. ఏడుకొండలు మినహా అంతటా వైసీపీ రంగులే వేస్తున్నారని పవన్ మండిపడ్డారు.
రాయలసీమలో రాజకీయనేతలకు పచ్చటి పొలాలున్నాయని, కానీ ఇక్కడి పేదలే పొట్ట చేతపట్టుకుని వలసలు వెళుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఓట్ల రాజకీయాలు చేయని రోజు, రైతుల్ని ఇబ్బంది పెట్టని రోజే జగన్ ను గౌరవిస్తానని పవన్ స్పష్టం చేశారు. సీమ నుంచి ఎందరో సీఎంలు అయ్యారని, అయినా ఇక్కడ వెనుకబాటుతనం తొలగిపోలేదన్నారు. రాయలసీమలో రైతులకు కోల్డ్ స్టోరేజిలు కట్టలేకపోయారని విమర్శించారు.