(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ శనివారం ఢిల్లీకి పయనమయ్యారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరుగుతుండగా మధ్యలోనే అయన ఢిల్లీ బయల్దేరారు. కేంద్ర ప్రభుత్వ ప్రముఖులతో సమావేశమయ్యేందుకు ఆయనకు అపాయింట్మెంట్ ఖరారైనట్లు పార్టీ శ్రేణులు వెల్లడించాయి. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని రైతులు ఆందోళన చేస్తున్న వేళ.. పవన్ ఢిల్లీకి వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది.
అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన పవన్.. అనంతరం సైలెంట్ అయ్యారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో మొన్నటి వరకు మోదీని విమర్శించిన పవన్.. క్రమంగా తన రూటును మారుస్తున్నారు. మోదీని, అమిత్ షాను పవన్ కల్యాణ్ పొగడ్తల ముంచెత్తుతున్నాడు. రాజధానిని మార్చాలని చూస్తే ఢిల్లీ వెళ్లి మోదీ, అమిత్ షాలను కలిసి రాజధాని గురించి మాట్లాడతానని ఇటీవలే వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది. తాజాగా ఆయన హస్తినకు వెళ్లడం వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే, రాజధాని అంశంపైనే ఆయన బీజేపీ పెద్దలతో మాట్లాడనున్నట్లు తెలుస్తోంది.
ఏపీ రాజధాని మార్పు విషయంలో ఆంధ్ర ప్రదేశ్లో నెలకొన్న అశాంతిని తొలగించడానికి కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని పవన్ కల్యాణ్ కోరుతున్న సంగతి తెలిసిందే. శుక్రవారం(జనవరి 10) మంగళగిరిలోని తమ పార్టీ కార్యాలయంలో తుళ్లూరు, మందడం, యర్రబాలెం, బేతపూడి, నిడమర్రు తదితర గ్రామాల నుంచి వచ్చిన రైతులు, మహిళలతో సమవేశం సందర్భంగా పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్, బీజేపీ కలిసి రాష్ట్రాన్ని విభజించాయని, విభజన వల్ల తలెత్తిన సమస్యల పరిష్కారం బాధ్యత కూడా ఆ పార్టీలపైనే ఉందని ఆయన తెలిపారు. ఇప్పుడు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉందని, అందుకే ఆ పార్టీని జోక్యం చేసుకోవాలని కోరుతున్నట్లు చెప్పారు. ఒక రాష్ట్రంలో అశాంతి చోటు చేసుకుని ప్రాంతాల మధ్య అభిప్రాయ భేదాలు నెలకొన్నప్పుడు అంతకంటే ఉన్నత స్థాయిలో ఉన్నవారు జోక్యం చేసుకుని పరిష్కరించాలి పేర్కొన్నారు. “రాజధాని అమరావతికి ప్రధాని మోదీ వచ్చి శంకుస్థాపన చేశారు. రాజధాని నిర్మాణానికి నిధులు కూడా ఇచ్చారు. అందువల్ల వారిపై బాధ్యత ఉంది. ఆ బాధ్యతను నెరవేర్చడానికి ముందుకొస్తారని, రావాలని కోరుకుంటున్నాను” అని అన్నారు.
కొన్ని రోజుల క్రితం పవన్ కల్యాణ్ అమెరికా వెళ్ళినపుడు అక్కడ రామ్ మాధవ్ ను కలిశారు. ఇద్దరి మధ్య చర్చలు జరిగాయి. జనసేన పార్టీని బీజేపీలో విలీనం చేస్తారేమో అనే ప్రచారం జరిగింది. కానీ, పవన్ అందుకు సిద్ధంగా లేరని తెలుస్తోంది. ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే పవన్.. బీజేపీకి దగ్గరవుతున్నట్టు కనిపిస్తోంది. జనసేనాని బీజేపీతో భాగస్వామ్యం అయితే తప్పకుండా ఏదో ఒక పదవి రావడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. మొత్తం మీద పవన్ ఢిల్లీ టూర్ పై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.