(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
తెలుగురాష్ట్రాలో సంచలనం సృష్టించిన వెటర్నరీ డాక్టర్ ప్రియాంకా రెడ్డి హత్య ఉదంతం తర్వాత మరోమారు ‘జీరో ఎఫ్ఐఆర్’ డిమాండ్ తెరపైకి వచ్చింది. సరిహద్దులతో సంబంధం లేకుండా అత్యవసర పరిస్థితుల్లో పోలీసులు ‘జీరో ఎఫ్ఐఆర్‘ నమోదు చేయాలన్న డిమాండ్ ప్రియాంకారెడ్డి ఘటనతో ఊపందుకుంది.
సాధారణంగా ఏదైనా ఘటనకు సంబంధించిన కేసుల నమోదు సమయంలో పోలీసులు ప్రాథమికంగా ఘటన జరిగిన ప్రాంతం తమ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందా? రాదా? అన్నది నిర్ధారించుకుంటారు. తమ పరిధిలోకి వస్తేనే కేసు నమోదు చేస్తారు. లేదంటే పలానా స్టేషన్కు వెళ్లాలని సూచిస్తారు. అత్యవసర పరిస్థితుల్లో ఈ నిబంధన వల్ల నిండు ప్రాణాలే బలి అవుతున్నాయి. ప్రియాంకారెడ్డి ఘటనలోనూ ఇదే జరిగింది. ప్రియాంకారెడ్డి ఆపదలో ఉన్నానని ఇంటికి ఫోన్ చేసినప్పుడు కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అయితే, శంషాబాద్ ఆర్జీఐఏ, శంషాబాద్ రూరల్ పోలీసులు తమ పరిధి కాదంటే, తమ పరిధి కాదంటూ నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఈలోగా జరగరాని ఘోరం జరిగి పోయింది. పోలీసులు వెంటనే స్పందించి ఉంటే తన కుమార్తె బతికేదని ప్రియాంకా తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరో ఒకరు స్పందించి ఉంటే.. పరిస్థితి మరోలా ఉండేదనే అభిప్రాయాలు ప్రజల నుంచి వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మళ్లీ ‘జీరో ఎఫ్ఐఆర్’ డిమాండ్ ఊపందుకుంది. బాధితురాలి కుటుంబ సభ్యులు కూడా ఇప్పుడు ఈ అంశాన్నే లేవనెత్తుతున్నారు. జాతీయ మహిళా కమిషన్ దృష్టికి తీసుకెళ్తామంటున్నారు.
ఢిల్లీలో నిర్భయ ఉదంతం తర్వాత ఎదురైన పరిణామాలను దృష్టిలో పెట్టుకుని కేంద్రం జీరో ఎఫ్ఐఆర్ కు ఆమోదం తెలిపింది. దీని ప్రకారం ఎవరైనా ఫిర్యాదుకు వస్తే పోలీసులు తప్పనిసరిగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. ప్రతి ఎఫ్ఐఆర్ కు ఓ నంబరు కేటాయిస్తారు. ఒకవేళ ఫిర్యాదు ప్రాంతం తమ పరిధిలోది కాదని భావిస్తే నంబరు లేకుండా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. దీన్నే ‘జీరో ఎఫ్ఐఆర్’ అంటారు.
జీరో ఎఫ్ఐఆర్ అంటే ఎవరైనా బాధితులు పోలీసులను ఆశ్రయిస్తే ఎఫ్ఐఆర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్తో సంబంధం ఉండదు. వెంటనే కేసును నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలి. బాధితులకు రక్షణ కల్పించడంతో పాటు ప్రాథమిక దర్యాప్తు చేయాల్సి ఉంటుంది. అత్యవసరంగా కేసును టేకప్ చేయడానికి దీన్ని ప్రవేశపెట్టారు. ప్రాథమిక దర్యాప్తు అనంతరం సంబంధిత పోలీస్ స్టేషన్కు కేసు బదిలీ చేస్తే అప్పుడు వారు నంబరు కేటాయిస్తారు. అయితే, కేంద్రం అమోదం తెలిపినా ఈ విధానాన్ని ఆ తర్వాత ఎవరూ పట్టించుకోలేదు. ప్రస్తుతానికి ఈ విధానం ముంబైలో అమలులో ఉంది. తాజా ప్రియాంకారెడ్డి ఘటన తర్వాత హైదరాబాద్లో కూడా దీనిని అమలు చేయాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.