హైదరాబాద్: దిశ కేసు నిందితుల మృతదేహాలకు రీ పోస్టుమార్టం చేస్తున్నారు. హైకోర్టు ఆదేశాలతో గాంధీ ఆసుపత్రిలో ఎయిమ్స్ ఫోరెన్సిక్ నిపుణుల బృందం రీ పోస్టుమార్టం చేస్తోంది. ఎయిమ్స్ ఫోరెన్సిక్ బృందంతో పాటు గాంధీ సూపరింటెండెంట్ కూడా పాల్గొననున్నారు. ఈ మొత్తాన్ని పోలీసులు వీడియో తీయనున్నారు. రీ పోస్టుమార్టం పూర్తి అయిన తర్వాత రిపోర్ట్ను షీల్డ్ కవర్లో అధికారులు కోర్టుకు సమర్పించనున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను గాంధీ వైద్యుల సమక్షంలో కుటుంబ సభ్యులకు పోలీసులు అప్పగించనున్నారు.
నిందితుల మృతదేహాలు 50 శాతం కుళ్లిపోయాయని గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ శ్రవణ్ హైకోర్టుకు తెలిపారు. దీంతో నిందితుల మృతదేహాలకు మళ్లీ పోస్ట్ మార్టం నిర్వహించాలని తెలంగాణ హైకోర్టు డిసెంబర్ 21న ఆదేశించింది. పోస్టుమార్టం మొత్తం వీడియో తీయాలని తెలిపింది. సోమవారం సాయంత్రంలోగా రీ పోస్టుమార్టం పూర్తి చేయాలని, అనంతరమే నిందితుల మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించాలని హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే.
డిసెంబర్ 6వ తేదీన శంషాబాద్ సమీపంలోని చటాన్పల్లి వద్ద జరిగిన ఎన్ కౌంటర్ లో నిందితులు ఆరిఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్నకేశవులు చనిపోయారు. ఈ కేసు విచారణలో భాగంగా సీన్ రీ కన్స్ట్రక్షన్ కోసం నిందితులను డిసెంబర్ 6వ తేదీన పోలీసులు ఘటనా స్థలికి తీసుకెళ్లగా పారిపోయేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో నిందితులు పోలీసుల నుంచి తుపాకీ లాక్కొని కాల్పులకు తెగబడడంతో పోలీసులు ఆత్మరక్షణ కోసం నిందితులు నలుగురిని ఎన్కౌంటర్ చేసిన విషయం తెలిసిందే. షాద్ నగర్ మండలం చటాన్పల్లి బ్రిడ్జి సమీపంలో దిశను తగులబెట్టిన చోటే నలుగురు నిందితులను పోలీసులు ఎన్కౌంటర్ చేశారు.