(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
మహారాష్ట్రలో ఎన్నికల ఫలితాలు వెలువడి పది రోజులు గడిచినా ప్రభుత్వ ఏర్పాటుపై ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. బీజేపీ-శివసేన కూటమికి ప్రభుత్వ ఏర్పాటుకు తగినంత మెజార్టీ లభించినా పీటముడి వీడలేదు. 50-50 ఫార్ములాకు కట్టుబడి తమకు కూడా సీఎం పదవి ఇవ్వాలని శివసేన పట్టుబడుతుండటం… దీనికి బీజేపీ ఒప్పుకోకపోవడంతో ప్రభుత్వ ఏర్పాటులో ప్రతిష్ఠంభన ఏర్పడింది. దీంతో శివసేన బీజేపీ అవసరం లేకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. అందులో భాగంగా సోమవారం సాయంత్రం రాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారితో శివసేన నేతలు భేటీ కానున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని వారు కోరనున్నట్లు తెలిసింది. భగత్ సింగ్ తో శివసేన ఎంపీ సంజయ్ రౌత్ సహా ఆరుగురు నేతలు సమావేశం అవుతారని తెలుస్తోంది.
మరోవైపు ఇతర పార్టీల నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తూ రాజకీయంగా కాక రగిలిస్తున్నారు శివసేన నేతలు. ఆ పార్టీ నేత సంజయ్ రౌత్ తమకి ఏకంగా 170 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందంటూ ప్రకటించడం సంచలనం కలిగిస్తోంది. నేషనలిస్ట్ కాంగ్రెస్ అధినేత శరద్పవార్ని కలిసిన తర్వాతే ఈ దూకుడు శివసేన పార్టీలో ఎక్కువైంది. శివసేనకి ఉన్న 56 మంది ఎమ్మెల్యేలకు అటు కాంగ్రెస్..ఎన్సిపిలను కలిపితే తప్ప ఈ సంఖ్య సాధ్యం కాదు. ఎన్సీపీ నుంచి ఖచ్చితమైన హామీ లభించింది కాబట్టే ఈ రేంజ్లో సంఖ్యని కూడా ప్రకటించినట్లు తెలుస్తోంది.
ఇక మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్, ఎన్సిపి చీఫ్ శరద్పవార్లు సోమవారం ఢిల్లీకి వెళ్లారు. శరద్ పవార్ భవిష్యత్ ప్రణాళికపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీతో చర్చించేందుకు వెళుతుండగా, ఫడ్నవీస్ బీజేపీ జాతీయాధ్యక్షుడు, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. ఇదిలా ఉంటే శివసేన ఎంపీ సంజయ్ రౌత్ తనకు ఓ మెసేజ్ పంపారని దాన్ని చూపించారు ఎన్సీపీ నేత అజిత్ పవార్. అందులో తనకు శుభాకాంక్షలు చెబుతున్నట్లుగా ఉందని అయితే దానర్థం వేరని చెప్పారు. శివసేన, బీజేపీల మధ్య జరుగుతున్న వార్ను చాలా దగ్గరగా సమీక్షిస్తున్న ఎన్సీపీ అధినేత శరద్ పవార్.. తాము విపక్షంలోనే కూర్చుంటామని చెబుతున్నప్పటికీ… ఆదివారం పలువురు సీనియర్ నేతలతో శరద్ పవార్ భేటీ అయి శివసేనతో కలిసి ప్రభుత్వ ఏర్పాటు విషయమై చర్చించినట్లు ప్రచారం జరుగుతోంది.
మహారాష్ట్రలో ముఖ్యమంత్రి పదవీకాలాన్ని చెరిసగం పంచుకోవాలంటూ బీజేపీ ముందు శివసేన డిమాండ్ పెట్టిన సంగతి తెలిసిందే. వర్లి నుంచి పోటీ చేసి గెలిచిన ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రేకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని ఆపార్టీ నేతలు అంటున్నారు. అయితే, ఈ డిమాండ్ కు బీజేపీ నేతలు ఒప్పుకోవట్లేదు. అంతేకాదు శివసేనపై మాటల యుద్దానికి పదును పెట్టారు. నవంబర్ 7వతేదీలోగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని లేదంటే రాష్ట్రపతి పాలన తప్పదని హెచ్చరించారు. రాష్ట్రపతి పాలనకైనా సిద్ధపడతాము కానీ శివసేనతో రాజీపడమని తేల్చిచెబుతున్నారు. శరాద్ పవర్ లో శివసేన ఎంపీ సంజయ్ భేటీ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చలకు దారి తీసింది. మరోవైపు పవర్ లో కాంగ్రెస్ అధిష్టానం కూడా చర్చలు జరుపుతోంది.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, శివసేన కలిసి పోటీ చేశాయి. 288 అసెంబ్లీ స్థానాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 105, శివసేన 56 సీట్లను గెలుచుకున్నాయి. అయిదుగురు ఇండిపెండెంట్లు మద్దతివ్వడంతో శివసేన బలం 61కి పెరిగింది. ఎన్సీపీ 54, కాంగ్రెస్ 44 స్థానాల్లో గెలుపొందాయి. బీజేపీకి ప్రభుత్వం ఏర్పాటు చేసే స్పష్టమైన ఆధిక్యం రాకపోవడంతో సీఎం పదవీకాలాన్ని చెరిసగం పంచుకోవాలన్న డిమాండ్ ను శివసేన తీసుకొచ్చింది. తాజా పరిణామాల నేపథ్యంలో ఎన్సీపీ, కాంగ్రెస్ తో కలిసి శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో మహారాష్ట్ర రాజకీయాలు మరింత ఆసక్తిగా మారాయి.