న్యూఢిల్లీ రామజన్మభూమి బాబరీ మసీదు వివాదం కేసులో సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నట్లు సున్నీ వక్ఫ్ బోర్డు పేర్కొన్నది. అయితే తీర్పు తమకు ఆశాభంగం కలిగించిందని బోర్డు న్యాయవాది జఫర్యాబ్ జిలానీ వ్యాఖ్యానించారు.
రామజన్మభూమి బాబరీ మసీదు కేసులో 2.77 ఎకరాల వివాద స్థలంపై యాజమాన్య హక్కులు బాల రాముడికి అప్పగిస్తూ శనివారం ఏకగ్రీవంగా తీర్పు చెప్పిన సుప్రీంకోర్టు ధర్మాసనం, వివాద స్థలంపై తమకు హక్కులు ఉన్నాయన్న వాదనను ముస్లింలు నిరూపించలేకపోయారని పేర్కొన్నది. అయితే మసీదు నిర్మాణానికి సున్నీ వక్ఫ్ బోర్డుకు అయోధ్యలోనే అయిదు ఎకరాల స్థలం కేటాయించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
ఏడు దశాబ్దాల ఈ రామజన్మభూమి – బాబరీ మసీదు భూమి హక్కుల న్యాయవివాదంలో సున్నీ వక్ఫ్ బోర్డు కూడా ఒక కక్షిదారు. తీర్పు తర్వాత మీడియాతో మాట్లాడుతూ, మాకు ఈ తీర్పు సంతృప్తి కలిగించలేదు. లోపలి వసారాలో మసీదు స్థలాన్ని కూడా అవతలి పక్షానికి అప్పగించారు. మా భవిష్య కార్యాచరణ నిర్ణయించుకుంటాం అని జిలానీ పేర్కొన్నారు.
Zafaryab Jilani, Sunni Waqf Board Lawyer: We respect the judgement but we are not satisfied, we will decide further course of action. #AyodhyaJudgment pic.twitter.com/5TCpC0QXl6
— ANI (@ANI) November 9, 2019
తీర్పులో పరస్పర విరుద్ధమైన అంశాలు చాలా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. తమ కమిటీ అంగీకరించిన పక్షంలో ఈ తీర్పుపై సమీక్ష కోరతామనీ, అలా కోరేందుకు తమకు హక్కుందనీ ఆయన అన్నారు. తీర్పు ఎలా ఉన్నా శాంతియుతంగా మెలగాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నట్లు జిలానీ పేర్కొన్నారు.