అమరావతి: సీఎం జగన్ పై ప్రతిపక్ష టీడీపీ సభ్యులు ప్రివిలైజ్ నోటీసులు ఇచ్చారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు అనని మాటలను అన్నట్లుగా ముఖ్యమంత్రి జగన్ వక్రీకరించారని ఆరోపిస్తూ సీఎంపై ప్రివిలైజ్ నోటీసు ఇచ్చారు. ఈ మేరకు స్పీకర్ తమ్మినేనిని కలిసి అందించారు.
గురువారం ఏపీ అసెంబ్లీ వెలుపల మార్షల్స్కు, టీడీపీ సభ్యులకు మధ్య జరిగిన ఘటనపై శుక్రవారం అసెంబ్లీలో పెను దుమారం రేగింది. ఏపీ అసెంబ్లీలో మార్షల్స్, టీడీపీ సభ్యుల మధ్య నిన్న జరిగిన ఘటన దృశ్యాల వీడియోను శుక్రవారం అసెంబ్లీలో ప్రదర్శించారు. అందులో అసెంబ్లీలోకి వస్తున్న ప్రతిపక్ష నేత చంద్రబాబును, టీడీపీ సభ్యులను మార్షల్స్ అడ్డుకున్నారు. తనను ఎందుకు అడ్డుకుంటున్నారంటూ చంద్రబాబు వారిపై ఆగ్రహం వ్యక్తం చేయడం కనిపించింది.
అనంతరం సీఎం జగన్ మాట్లాడుతూ చీఫ్ మార్షల్స్ను చంద్రబాబు ‘బాస్టర్డ్’ అని దుర్భాషలాడారని ఆరోపించారు. లోకేష్ అయితే ఏకంగా మార్షల్ గొంతు పట్టుకున్నారని, ఎవడు ఎవడిపైన దాడి చేశారని సీఎం జగన్ ప్రశ్నించారు. మార్షల్స్పై చంద్రబాబు, లోకేష్ తీరు దారుణంగా ఉందన్నారు. చంద్రబాబు ఎంత దారుణంగా ప్రవర్తించారో చెప్పడానికి వీడియోలే నిదర్శనమన్నారు. విపక్ష నేత రావాల్సిన గేటు నుంచి రాకుండా మరో గేటు నుంచి వచ్చారని చెప్పారు. సభ్యులు కానివారితో ఊరేగింపుగా చంద్రబాబు వచ్చారని, అంతమంది వచ్చినప్పుడు తనిఖీలు చేసేందుకు మార్షల్స్ ఆపారని సీఎం తెలిపారు.
తాను ‘నో క్వశ్చన్’ పదాన్ని బాస్టెడ్గా చిత్రీకరించారని చంద్రబాబు చెప్పారు. లేని దాన్ని ఉన్నట్లుగా అసెంబ్లీలో చూపించారని మండిపడ్డారు. తన నోటి నుంచి ఎప్పుడు బూతులు రావని, ఎప్పుడైనా కోపం వస్తే గట్టిగా మాట్లాడతానని ఆయన చెప్పారు.