(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి: వైసిపి ప్రభుత్వం ఒంటెద్దు పోకడలతో ముందుకు వెళుతోందని టిడిపి సభ్యుడు అనగాని సత్యప్రసాద్ విమర్శించారు. సోమవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ ఎన్నికలకు ముందు రాజధాని అమరావతిలోనే ఉంటుందనీ వైసిపి నేతలు హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తూ రాజధాని మార్చాలని భావిస్తే మళ్లీ ఎన్నికల్లో ప్రజాతీర్పు కోరాలని అన్నారు. రాజధాని తరలిపోతుందన్న ఆందోళనతో లక్షలాది మంది రోడ్ల మీదకొచ్చి ఆందోళనలు చేస్తున్నారన్నారు.
పది వేల మంది పోలీసులను అసెంబ్లీ బయట బందోబస్తుగా పెట్టుకుని ఈ బిల్లు తీసుకురావడం కరెక్టేనా అని ప్రశ్నించారు. ఈ బిల్లు వల్ల రాష్ట్రం సర్వనాశనం అవుతుందని సత్యప్రసాద్ అన్నారు. ఎవరి లాభం కోసం రాజధాని మారుస్తున్నారని ప్రశ్నించారు.కొంత మంది స్వార్థం కోసం దీన్ని తరలిస్తున్నారని సత్యప్రసాద్ ఆరోపించారు. రాజధానిని తరలించి జగన్ చరిత్ర హీనులుగా నిలిచిపోవద్దని హితవు పలికారు. అభివృద్ధి వికేంద్రీకరణకు తమ పార్టీ వ్యతిరేకం కాదన్నారు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్గా విశాఖ అభివృద్ధి చెందాలన్నారు. మంత్రి బుగ్గన గత తెలుగుదేశం ప్రభుత్వంపై సత్యదూరమైన ఆరోపణలు చేశారన్నారు. రాజధాని గ్రాఫిక్స్ అంటూ ఆరోపణలు చేస్తున్న వారు వస్తే జరిగిన నిర్మాణాలు మొత్తం చూపిస్తామని సత్యప్రసాద్ అన్నారు.