(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
తెలంగాణ ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు ఏ తీర్పు ఇవ్వబోతుందనేది ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తిగా మారింది. హైకోర్టు ఏం చెబుతుందనే దానిపై కార్మిక సంఘాలు, ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సమ్మెపై సోమవారం కొంతవరకూ విచారించిన హైకోర్టు… కొన్ని అంశాల కారణంగా… విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. మధ్యాహ్నం 2.30 గంటలకు విచారణ చేపట్టనుంది. ప్రభుత్వం బుధవారం వరకూ గడువు కోరినా… అంత సమయం ఇచ్చేందుకు హైకోర్టు ఒప్పుకోలేదు. హైకోర్టు ఆదేశాలపై ఇవాళ యూనియన్ సభ్యులు 12 గంటలకు సమావేశమై చర్చించనున్నారు. ఎలా ముందుకు వెళ్లాలి… ఏయే అంశాలపై పట్టుపట్టాలో నిర్ణయం తీసుకోనున్నారు.
ఆర్టీసీ సమ్మెపై సోమవారం హైకోర్టులో వాడివేడి వాదనలు జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన అడిషనల్ అడ్వొకేట్ జనరల్… ఆర్టీసీ విలీనంతో పాటు అన్ని అంశాల మీదా చర్చించాల్సిందేనని యూనియన్లు పట్టుపట్టాయని, కోర్టు చెప్పిన ప్రకారం 21 డిమాండ్లపై చర్చిద్దామంటే వినలేదని కోర్టుకు తెలిపారు. యూనియన్ నాయకులు చర్చలు జరపకుండానే బయటకు వెళ్లిపోయారని కోర్టుకు ఏఏజీ విన్నవించారు. దీంతో విలీనం డిమాండ్ను పక్కనపెట్టి మిగిలిన అంశాలపై చర్చించాలని ఆర్టీసీ యూనియన్లకు హైకోర్టు సూచించింది. రాత్రికి రాత్రి విలీనం కావాలంటే ఎలా సాధ్యం అవుతుందని ప్రశ్నించింది. అయితే హైకోర్టు ఆదేశాలను అధికారులు తప్పుగా అన్వయించుకున్నారని యూనియన్ల తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తెచ్చారు. మొత్తం 45 డిమాండ్లలో ఆర్థిక భారం కాని వాటిపై చర్చించాలని తాము ఆదేశించినట్టు న్యాయమూర్తి తెలిపారు.
అదనపు అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు ఆర్టీసీ తరపున వాదనలు వినిపిస్తున్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ బి.ఎస్.ప్రసాద్ ను హాజరుకావాలని కోర్టు పిలిపించింది. అనంతరం ప్రసాద్ ప్రభుత్వం తరపున వాదనలు కొనసాగించారు. కార్మికుల తీరు సరిగా లేదని ప్రసాద్ కోర్టుకు తెలిపారు. 21 డిమాండ్లలో నాలుగింటి పరిష్కారానికి రూ.46.2 కోట్లు అవసరమని నివేదికల్లో పేర్కొన్నారని, ప్రభుత్వం ఎన్నో ఖర్చలు చేస్తోంది.. రూ.47 కోట్లు ఇవ్వలేదా? అని ఏజీని న్యాయస్థానం ప్రశ్నించింది. రూ.47 కోట్లు ఖర్చయ్యే నాలుగు డిమాండ్లపై అంగీకరించి ఉంటే ఇరువర్గాల మధ్య చర్చలపై విశ్వాసం ఏర్పడేదని అభిప్రాయపడింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శిలతో మాట్లాడి ఒక ప్రకటన తీసుకోవాలని ఏజీని ఆదేశించింది.