అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజధాని పర్యటనలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతు తెలిపేందుకు మంగళవారం కృష్ణయపాలెం నుంచి మందడం వెళ్తున్న సమయంలో పవన్ను పోలీసులు అడ్డగించారు. వెంకటపాలెం చెక్ పోస్టు వద్ద పవన్ ను పోలీసులు నిలిపివేశారు. దీంతో పవన్ నేలపైన కూర్చొని పోలీసుల తీరుకు నిరసనకు దిగారు. రోడ్డుపైనే పవన్ ధర్నా నిర్వహించారు. పవన్ను అడ్డుకున్నారన్న విషయం తెలుసుకున్న రాజధాని ప్రాంత రైతులు వెంకటపాలెం చెక్పోస్టు వద్దకు భారీగా తరలివచ్చారు. చెక్పోస్టు వద్ద పోలీసులు కూడా భారీగా మోహరించడంతో ఉద్రిక్తత నెలకొంది. మందడం మీదుగా సీఎం వెళ్లాల్సి ఉందని, సీఎం వెళ్లే వరకు వేచి చూడాలని పోలీసులు పవన్కు సూచించారు. పోలీసుల సూచన మేరకు పవన్ అక్కడే వేచి ఉన్నారు. పోలీసుల తీరును నిరసిస్తూ మహిళలు, రైతులు నినానాదాలు చేశారు. రహదారికి అడ్డంగా కంచె వేయడంపై జనసేన కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమరావతి పర్యటనలో భాగంగా పవన్ మంగళవారం ఎర్రబాలెం రైతులను కలిసి వారితో మాట్లాడారు. అనంతరం మందడం బయలుదేరారు. అయితే, మార్గమధ్యలో పవన్ వాహనాలను పోలీసులు అడ్డుకున్నారు. సచివాలయంలో సీఎం ఉన్నందున…. సీఎం వెళ్లాకే మందడం గ్రామంలోకి అనుమతిస్తామన్నారు. లేకుంటే నేరుగా తుళ్లూరు వెళ్లాలని సూచించారు. పవన్ కాన్వాయ్ ముందుకు వెళ్లకుండా తాళ్ల సాయంతో పోలీసులు అడ్డుకోవడంతో స్థానిక రైతులు, అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు, జనసేన కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగి తోపులాటకు దారితీసింది. కార్యకర్తలు ముళ్లకంచెలను తొలగించి ముందుకు దూసుకువచ్చారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పార్టీ కార్యకర్తలను పవన్ సముదాయించారు. వాహనాలకు అనుమతి లేకపోతే.. నడుచుకుంటూ మందడం చేరుకుంటామని చెబుతూ.. వాహనం దిగి కార్యకర్తలతో కలిసి పవన్ పాదయాత్రగా నడుచుకుంటూ మందడం వెళ్లారు. పోలీసుల ఆంక్షల్ని పట్టించుకోకుండా పవన్ ముందుకు సాగారు.
అనంతరం మందడం వద్ద పవన్ ను మరోసారి పోలీసులు అడ్డుకున్నారు. మందడం మీదుగా సీఎం జగన్ వెళ్లాల్సి ఉండటతో ఆయనను ఆపేశారు. రోడ్డుపై బ్యారికేడ్లు, ఇనుప ముళ్ల కంచెలను ఏర్పాటు చేశారు. సీఎం వెళ్లేంత వరకు కాసేపు ఆగాలని పోలీసులు కోరారు. అయితే, సీఎం జగన్ రాకపోవడంతో రహదారిపై ఉన్న ముళ్ల కంచెలను తొలగించుకుని ఆయన అక్కడి నుంచి ముందుకు కదిలారు. ఆ తర్వాత పోలీసులు మళ్లీ అడ్డుకున్నారు. దీంతో రోడ్డు మీద నుంచి కిందకు దిగి ముళ్ల చెట్ల మధ్య నడుస్తూ ఆయన ముందుకు సాగారు. వారిని నిలువరించేందుకు పోలీసులు విశ్వయత్నం చేశారు. ఈ సందర్భంగా పోలీసులకు, రైతులకు మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. పోలీసుల ఆంక్షల మధ్యే పవన్ మందడం చేరుకున్నారు.
అంతకు ముందు.. రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు చేపట్టిన ఆందోళనలకు పవన్ మద్దతు ప్రకటించారు. ఎర్రబాలెంలో మహిళా రైతులతోపాటు దీక్షలో కూర్చుని మద్దతు ప్రకటించారు. మహిళలు తమ సమస్యలను పవన్కు వివరించారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వ తీరుపై పవన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అమరావతి ప్రాంత మహిళలు ఇళ్ల నుంచి బయటకు వచ్చి… రోడ్లపై ఆందోళనలు చేయడం బాధిస్తోందని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. మనుషులను వైసీపీ నేతలు పశువులుగా అభివర్ణిస్తుండటం దారుణమని అన్నారు. అమరావతి రైతులు పోరాటాన్ని ఆపకూడదని, ఇలాగే కొనసాగించాలని పిలుపునిచ్చారు. రైతుల పోరాటాన్ని పోలీసు శాఖ మానవతా దృక్పథంతో చూడాలని అన్నారు. 151 సీట్లు శాశ్వతం కావని… అవి ఎప్పుడైనా కూలిపోవచ్చని చెప్పారు.