న్యూఢిల్లీ: పౌరసత్వ చట్ట సవరణ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని.. దీని చట్టబద్ధతను కోర్టు నిర్ణయిస్తుందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కపిల్ సిబల్ అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నంత మాత్రాన అది చట్టబద్ధం కాదని ఆయన వ్యాఖ్యానించారు. బిల్లును సవాల్ చేస్తూ గురువారం ఇండియన్ ముస్లిం లీగ్ (ఐయూఎంఎల్) సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఐయూఎంఎల్ తరఫున కపిల్ సిబల్ వాదించనున్నారు. ఈ సందర్భంగా ఎన్డీటీవీతో కపిల్ సిబల్ ప్రత్యేకంగా మాట్లాడారు.
‘ఈ బిల్లు రాజ్యాంగ విరుద్ధం. అమిత్ షా అన్నంత మాత్రాన అది చట్టబద్ధం కాదు. అమిత్ షా సుప్రీం కోర్టు జడ్జి కాదు బతికిపోయాం’ అని వ్యాఖ్యానించారు. ఈ బిల్లు విషయంలో శివసేన అనుసరించిన వైఖరిపైనా సిబల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలో కనీస ఉమ్మడి ప్రణాళిక కిందే శివసేనతో కలిసి పనిచేస్తున్నామని సిబల్ అన్నారు. కొన్ని అంశాల్లో సేనకు తమ సొంత అభిప్రాయాల్ని వ్యక్తపరిచే హక్కు ఉంటుందని చెప్పారు. అదే సమయంలో కాంగ్రెస్ తమ సిద్ధాంతాలను విషయంలో ఏనాడూ వదులుకోలేదని స్పష్టం చేశారు.
రాజ్యసభలో ఈ బిల్లుకు శివసేన మద్దతు ఇవ్వకపోవడంపై కపిల్ సిబల్ మాట్లాడుతూ.. ఒకవేళ వారు మద్దతిచ్చినప్పటికీ.. తుది ఫలితంపై పెద్ద ప్రభావం ఉండేదికాదని చెప్పారు. అసోం ఎన్ఆర్సీలో 19లక్షల మందిని ప్రస్తుతానికి విదేశీయులుగా గుర్తించారని, వీరిలో అధిక శాతం హిందూ జనాభా ఉన్నందునే బీజేపీ ఈ బిల్లు తీసుకొచ్చిందని సిబల్ ఆరోపించారు. వారు ముస్లింలుగా ఉంటే బిల్లు వచ్చేది కాదన్నారు. కేవలం ఒక వర్గానికి మాత్రమే లబ్ధి చేకూరేలా ఈ బిల్లు రూపొందించారని సిబల్ పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక తిసుకొచ్చిన పౌరసత్వ చట్ట సవరణ బిల్లుకు పార్లమెంట్ ఉభయసభలు ఆమోదం లభించిన విషయం తెలిసిందే. ఈ బిల్లుపై గురువారం రాత్రి రాష్ట్రపతి కూడా సంతకం చేయడంతో చట్టంగా మారింది.
అయితే, పౌరసత్వ సవరణ బిల్లుపై శివసేన తొలుత లోక్సభలో మద్దతుగా ఓటేసింది. కానీ, రాజ్యసభలో మాత్రం ఓటింగ్కు దూరంగా ఉంది. మహారాష్ట్రలో ఇరు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. బిల్లుపై కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో శివసేన తమ వైఖరి మార్చుకొని ఉంటుందని తెలుస్తోంది.