ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆ పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. తనతో కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారంటూ గత అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బాంబుపేల్చారు ఏపీ సీఎం జగన్. తాజాగా వంశీ రాజీనామాతో జగన్ చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది. వంశీ దారిలోనే మరో పదిమంది టీడీపీ ఎమ్మెల్యేలు దుకాణం సర్దేసేందుకు రెడీ అవుతున్నారన్న మాట తెలుగు తమ్ముళ్లను కలవరపెడుతోంది. ఇదే జరిగితే చంద్రబాబుకు ప్రతిపక్ష నేత హోదా గల్లంతవ్వడం ఖాయమన్న ప్రచారం రాజకీయవర్గాల్లో సాగుతోంది.
భవిష్యత్ రాజకీయాల దృష్ట్యా చంద్రబాబుకు తెలుగు తమ్ముళ్లు గట్టి షాక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారని ప్రచారం జరుగుతోంది. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ నేతలపై కేసులు నమోదు అవుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే వైసీపీలో చేరేందుకు కొందరు ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో ఓడిపోయినా వచ్చే ఎన్నికల్లో అయినా తమ రాజకీయ భవిష్యత్ కు బాటలు వేసుకోవాలని కొందరు తెలుగు తమ్ముళ్లు వ్యూహరచన చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. 2024లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పుంజుకునే అవకాశం లేదని కొందరు భావిస్తున్నారట. ఈ పరిణామాల నేపథ్యంలో వైసీపీలో చేరితే కనీసం ఉనికిని అయినా కాపాడుకోవచ్చు అనే చర్చ.. నేతల్లో కనిపిస్తోందట. అయితే, తన పార్టీలోకి రావాలంటే రాజీనామాలు చేసి తీరాల్సిందేనని ఇప్పటికే జగన్ స్పష్టం చేశారు. అధికార పార్టీలోకి వచ్చేందుకు విపక్ష శాసనసభ్యులు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నా.. ఫిరాయింపుల విషయంలో జగన్ ఆచితూచి వ్యవహరిస్తున్నారు.
ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా ఎవరైనా తమ పదవులకు రాజీనామా చేసి వైసీపీలో చేరాలని జగన్ సూచించారు. గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన తప్పులు తాము చేయబోమని క్లారిటీ ఇచ్చేశారు. వైసీపీ ఎమ్మెల్యేలను పదవులకు రాజీనామా చేయించకుండా పార్టీలోకి చేర్చుకోవడమే కాకుండా కొందరికి మంత్రి మంత్రి పదవులు కట్టబెట్టడంపై జగన్ ఆనాడు అభ్యంతరం వ్యక్తం చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఫిరాయింపులను ప్రోత్సహిస్తే చెడ్డపేరు వస్తుందన్న భయం ఓవైపు వెంటాడుతున్నా… ఆ లోపు బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభిస్తే సమస్యలు తప్పవని జగన్ ఓ అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన రాజీనామా కండిషన్ పెట్టారు. ఇక వంశీ దారిలో మరికొంత మంది టీడీపీ ఎమ్మెల్యేలు కూడా వైసీపీలో చేరితే… చంద్రబాబుకు ప్రతిపక్ష నేత హోదా గల్లంతవ్వడం ఖాయమన్న ప్రచారం రాజకీయవర్గాల్లో సాగుతోంది.
ప్రస్తుతం ఉన్న ఏపీ అసెంబ్లీలో 10శాతం సీట్లు సాధిస్తే ప్రతిపక్ష హోదా ఇస్తారు. ఈ లెక్కన 18 సీట్లు ఉంటే చాలు. కానీ చంద్రబాబుకు అసెంబ్లీలో 23 ఎమ్మెల్యే సీట్లున్నాయి. గన్నవరం ఎమ్మెల్యే వంశీ రాజీనామా చేశారు. ఆయన బాటలోనే మరో పది మంది కనుక వైసీపీలో చేరితే చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా గల్లంతుకావడం ఖాయం. ఇక రాబోయే స్థానిక సంస్థలను దృష్టిలో పెట్టుకొని టీడీపీ కార్యకర్తలు సైతం పెద్ద ఎత్తున వైసీపీలో చేరేందుకు రెడీ అవుతున్నట్టు తెలిసింది. చంద్రబాబు అధికారం కోల్పోయాక కూడా తన తీరు మార్చుకోలేదని, దీంతో టీడీపీ నేతలు విసిగిపోతున్నారని.. అందుకే తమ వైపు చూస్తున్నారని వైసీపీ నేతలు అంటున్నారు. తన పార్టీలోకి రావాలంటే రాజీనామాలు చేసి తీరాల్సిందేనని జగన్ తీసుకున్న వైఖరి దేశవ్యాప్తంగా ఫిరాయింపులకు పాల్పడే ప్రజాప్రతినిదులకు ఆదర్శంగా ఉండబోతోందన్న ప్రశంసలు ఓవైపు వినిపిస్తున్నాయి. మరోవైపు అభివృద్ధి లేదా ఇతరత్రా సాకులు చెప్పి ఫిరాయింపులకు పాల్పడే ప్రజాప్రతినిధులను ప్రజలు ఏ మేరకు ఆదరిస్తారనే అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి.