(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
బంగాళాఖాతంలో కొనసాగుతున్న ‘బుల్బుల్’ తుఫాను తీరం వైపు దూసుకొస్తోంది. తీవ్ర తుఫానుగా మారిన బుల్బుల్ పారదీప్కు దక్షిణ ఆగ్నేయ దిశగా 310 కిలోమీటర్ల దూరంలో.. పశ్చిమ బెంగాల్కు దక్షిణ నైరుతి దిశగా 450 కిలోమీటర్లు, బంగ్లాదేశ్కు దక్షిణ నైరుతి దిశగా 550 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్టు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఈ తుఫాను శనివారం అర్ధరాత్రి పశ్చిమ బెంగాల్ సాగర్ దీవులు, బంగ్లాదేశ్ మధ్య తీరం దాటే అవకాశం ఉందని చెప్పారు. ఈ సమయంలో గంటకు 135 కిలోమీటర్ల వేగంగా గాలుల వీస్తాయని భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. బుల్బుల్ తుఫాను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టింది. పలు చోటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దింపింది.
సముద్రం అల్లకల్లోలంగా ఉండడంతో జాలర్లు చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. ఒడిసా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు పేర్కొన్నారు. తుఫాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం తుఫాను ప్రభావంతో గాలులు గంటకు 110 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నాయి. ఇక తుఫాను ప్రభావంతో కచ్చా ఇళ్లు దెబ్బతింటాయని చెప్పిన అధికారులు, విద్యుత్, సమాచార వ్యవస్థలు దెబ్బతింటాయని హెచ్చరించారు. రోడ్లు కూడా ధ్వంసం అవుతాయని చెప్పారు. భారీగా పంటనష్టం, చెట్లు విరిగిపడటం వంటివి జరుగుతాయని వాతావరణశాఖ హెచ్చరించింది.ప్రజలు అప్రమత్తతతో వ్యవహరించాలని ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని అధికారులు సూచించారు.