(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
దిశ హత్యాచారం కేసులో నలుగురు నిందితులను పోలీసులు చటాన్ పల్లి వద్ద ఎన్ కౌంటర్ చేయడంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతున్న వేళ.. నిందితుల కుటుంబ సభ్యుల నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తన భర్తను అన్యాయంగా చంపేశారని దిశ కేసులో ఏ4 నిందితుడు చెన్నకేశవులు భార్య లక్ష్మి ఆరోపించింది. తన భర్త తప్పు చేశాడని పోలీసులు, కోర్టు నమ్మితే దానికి తగిన శిక్ష విధిస్తే బాగుండేదని, కానీ ఇలా ఎన్ కౌంటర్ చేయడం ఏంటని ప్రశ్నించింది. తన భర్తను చంపినట్టే తనను కూడా చంపాలని ఆవేదన వ్యక్తం చేసింది.
‘ఇటువంటి కేసులు దేశంలో చాలా ఉన్నాయి కదా. దిశ తన చెల్లికి ఫోన్ చేసే బదులు వేరే ఎవరికయినా ఫోన్ చేయొచ్చు కదా? ఒక అమ్మాయి కోసం నలుగురి ప్రాణాలు తీయడం తప్పు సర్.. ఇది పెద్దతప్పు. కోర్టు తీర్పు ఇవ్వకుండానే చంపేశారు సర్.. ఇంతగానం చేయడం తప్పు సర్. న్యాయం కాదిది అన్యాయం. మా ఆయనను ఎక్కడ చంపారో నన్నుకూడా అక్కడికే తీసుకెళ్లి చంపండి’ అని ఆమె వ్యాఖ్యానించింది. కోర్టు తీర్పు ఇచ్చాకే శిక్ష అమలు చేస్తే బాగుండేదని ఆమె పేర్కొంది. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నప్పుడు తిరిగి పంపిస్తామని మాట ఇచ్చారన్న ఆమె.. తీరా తీసుకెళ్లి చంపేశారని కన్నీళ్లు పెట్టుకుంది. ‘నా భర్త లేకుండా నేను బతకను..నేనూ చనిపోతాను’ అని పేర్కొంది.
నిందితుల ఎన్ కౌంటర్ తో దిశకు న్యాయం జరిగిందంటూ ప్రజలు ఆనందం ఓవైపు.. భర్త, బిడ్డలను నిందితుల కుటుంబ సభ్యుల కన్నీళ్లు మరోవైపు. అయితే, తప్పుకు శిక్ష పడాల్సిందేనని ప్రజలు వారిని ఓదార్చుతున్నారు. కాగా, దిశ కేసులో సీన్ రికన్ స్ట్రక్షన్ చేసేందుకు నిందితులను చటాన్ పల్లికి తీసుకెళ్లి అక్కడ విచారణ చేస్తున్న సమయంలో పారిపోయేందుకు ప్రయత్నించగా నిందితులను ఎన్ కౌంటర్ చేశారు. దీనిపై దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తం చేస్తున్నారు.