(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
జనసేన పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు వ్యవహారం మరోసారి హాట్టాపిక్గా మారింది. శనివారం జరిగిన పార్టీ విస్తృతస్థాయి సమావేశానికి రాపాక డుమ్మా కొట్టడం చర్చనీయాంశమైంది. ఈ సమావేశానికి దూరంగా ఉన్న రాపాక.. గుడివాడలో మంత్రి కొడాలి నానితో కలిసి ఎడ్ల పందాలను తిలకించారు. ఆయన ఉద్దేశపూర్వకంగానే పార్టీ సమావేశానికి రాలేదని తెలుస్తోంది. పార్టీకి సంబంధించి కీలక భేటీకి రాపాక హాజరు కాకపోవడంపై జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.
గత కొద్ది రోజులుగా వైసీపీ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపిస్తున్న ఎమ్మెల్యే రాపాక జనసేన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. గత డిసెంబర్ లో కాకినాడలో పవన్ కల్యాణ్ చేసిన దీక్షకు కూడా ఆయన వెళ్లలేదు. అసెంబ్లీ సమావేశాలు ఉండటంతో వెళ్లలేదని అప్పుడు చెప్పారు. మళ్లీ ఇప్పుడు పార్టీ సమావేశానికి వెళ్లలేదు. అప్పుడు అసెంబ్లీ సెషన్స్ కారణమని చెప్పిన రాపాక.. ఈ కీలక సమావేశానికి హాజరుకాకపోవడంపై ఎలాంటి వివరణ ఇస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
కొన్ని రోజులుగా రాపాక వరప్రసాద్ వైఎస్ జగన్పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆయన వ్యవహరం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. అధికార వైసీపీ నిర్ణయాలకు మద్దతు ఇస్తూ ఆపార్టీకి దగ్గర అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. జగన్ సర్కార్పై వరుసగా ప్రశంసలు కురిపించారు. ఇటీవలే సీఎం జగన్ ప్రతిపాదించిన మూడు రాజధానులకు కూడా రాపాక మద్దతు ఇచ్చారు. రాజధానిపై పవన్ నిర్ణయంతో తనకు సంబంధం లేదని.. ఆయన ఇంట్లోనే రెండు అభిప్రాయాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. పవన్ కూడా మూడు రాజధానుల్ని వ్యతిరేకించడం లేదని.. పార్టీ అధినేతగా నిర్ణయం ఆయనదేనని.. తనకు పార్టీ కన్నా ఓట్లేసి గెలిపించిన ప్రజలే ముఖ్యం చెప్పారు. రాజధాని ఎక్కడ పెడతారో స్పష్టం చేయమని అడుగుతున్నారని.. అమరావతి భూములు లాక్కున్నప్పుడు పవన్ ఆందోళన చేశారని గుర్తు చేశారు.
రాపాక వ్యవహార శైలిపై పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఏపీ ప్రభుత్వ తీరుపై మండిపడుతుంటే.. రాపాక మాత్రం అనుకూల వ్యాఖ్యలు చేస్తున్నారు. పార్టీలో కొనసాగుతూనే.. ఇలా జగన్ సర్కార్ నిర్ణయాలకు మద్దతు పలకడం వారికి ఇబ్బందిగా మారింది. రాజధాని సహా పలు అంశాలపై జగన్ ప్రభుత్వాన్ని జనసేన అధినేత విమర్శలు గుప్పిస్తుంటే.. రాపాక మాత్రం ప్రభుత్వ నిర్ణయాలను సమర్థించారు. ఈ క్రమంలో రాపాక వ్యవహారం జనసేనలో హాట్టాపిక్గా మారింది. రాపాకపై పార్టీ అధినేత ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.