(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి: అమరావతి రాజధాని రైతుల త్యాగం దేశానికే ఆదర్శమనీ, రైతుల ఆందోళనకు మద్దతుగా ఉంటామనీ టిడిపి నేత వంగవీటి రాధా అన్నారు. రాజధానిగా అమరావతి కొనసాగించాలని తుళ్లూరులో నిరసనలు కొనసాగుతున్నాయి. రాజధాని రైతుల ఆందోళనకు మంగళవారం ఆయన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా రాధ మాట్లాడుతూ రైతులకు కులాలను అంటగట్టడం సరికాదని అన్నారు. పక్క రాష్ట ముఖ్యమంత్రితో మాట్లాడటానికి సిఎం జగన్కు సమయం ఉంది కానీ రాజధాని రైతులతో మాట్లాడేందుకు సమయం లేదా అని రాధా ప్రశ్నించారు.
ఏ జిల్లాలో ప్రమాణ స్వీకారం చేశారో ఆ జిల్లాకే జగన్ సమస్యలు సృష్టించారని విమర్శించారు. రైతుల నాయకత్వంలో జరిగే ఆందోళనలో భాగస్వాములమవుతామన్నారు. రాష్ట్రానికి ఒకటే రాజధాని, అది అమరావతి అన్న నినాదంతో కలిసకట్టుగా ఉద్యమిద్దామని పిలుపునిచ్చారు.
దివంగత టిడిపి నేత నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసిని కూడా రైతుల ఆందోళనకు సంఘీభావం తెలియజేశారు. రైతులకు మద్దతుగా కొ ద్దిసేపు దీక్షా శిబిరంలో కూర్చొన్నారు.