అమరావతి: రాష్ట్రంలో మండలి కచ్చితంగా ఉండాలని రాజ్యాంగంలో లేదని సీఎం జగన్ అన్నారు. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను అడ్డుకోవడానికే మండలి పనిచేస్తోందని, అలాంటప్పుడు మండలి ఉండి ఏం లాభమని ప్రశ్నించారు. సోమవారం మండలి రద్దు అంశంపై శాసనసభలో ఆయన మాట్లాడారు. మండలి రద్దు చేస్తున్నామని చెప్పడానికి గర్విస్తున్నానని సీఎం జగన్ అన్నారు. ప్రజాప్రయోజనం లేని మండలిపై డబ్బు ఖర్చు చేయడం దండగని తెలిపారు. మండలి నిర్వహణ కోసం ఏడాదికి రూ.60 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పారు. రూపాయి ఖర్చు లేకుండా విద్యార్థులకు ఇంగ్లిష్ మీడియం చదువు చెబుతామంటే అడ్డుకున్నారని జగన్ మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ బిల్లులకు కూడా మండలి అడ్డుతగిలిందన్నారు. రాష్ట్రంలోని ప్రతి ప్రాంతం బాగుపడాలని, వికేంద్రీకరణ బిల్లు పెడితే దాన్ని కూడా మండలి అడ్డుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బిల్లులను ఎలా అడ్డుకోవాలనే దిక్కుమాలిన ఆలోచన చేసే ఇలాంటి సభలు మనకు అవసరమా అని సీఎం జగన్ ప్రశ్నించారు. మండలిని కొనసాగిస్తే ఏడాదిలో తమకు మెజార్టీ వస్తుందని తెలిసినా.. ప్రజల కోసం రద్దు చేయాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. పార్టీ అవసరాల కంటే ప్రజా ప్రయోజనాలే తమకు ముఖ్యమని జగన్ స్పష్టం చేశారు.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 164 (2) ప్రకారం ముఖ్యమంత్రి నేతృత్వంలోని క్యాబినెట్ నేరుగా అసెంబ్లీకి జవాబుదారీగా ఉంటుందని తెలిపారు. రాజ్యాంగ నిర్మాతలు మండలి తప్పనిసరి అని భావించి ఉంటే ప్రతి రాష్ట్రంలోనూ రద్దు చేయడానికి వీల్లేని విధంగా రూపొందించి ఉండేవారని చెప్పారు. అలాకాకుండా రెండో సభను ఆప్షనల్ గా రాష్ట్ర శాసనసభ నిర్ణయానికే వదిలేసి ఆర్టికల్ 169 ప్రకారం మండలి రద్దు అధికారాలను కూడా రాష్ట్ర అసెంబ్లీకే ఇచ్చిందన్నారు. విద్యావంతుల సంఖ్య అతి తక్కువగా ఉన్న రోజుల్లో, మేధావులు, ఉన్నత విద్యావంతులకు అవకాశం కల్పించేందుకే మండలి ఏర్పాటు అవకాశం కల్పించారని వివరించారు. నేటి శాసనసభలో అలాంటి దుస్థితి లేదన్నారు. అసెంబ్లీలో ముగ్గురు పీహెచ్ డీలు, 38 పోస్ట్ గ్రాడ్యుయేట్లు, 13 మంది డాక్టర్లు, 14 మంది ఇంజినీర్లు, 68 మంది గ్రాడ్యుయేట్లు ఉన్నారని తెలిపారు. వీరిలో ముగ్గురు సివిల్ సర్వీసెస్ అధికారులున్నారని చెప్పారు. ఇద్దరు గ్రూప్-1 అధికారులు, ఒక జర్నలిస్ట్, ఒక ప్రొఫెసర్, ఇద్దరు ఉపాధ్యాయులు, రైతులు కూడా ఉన్నారని, వీళ్లందరూ ప్రజలు నేరుగా ఎన్నుకున్న ప్రజా ప్రతినిధులని గుర్తు చేశారు. దేశంలో ఉన్న 28 రాష్ట్రాల్లో ఆరు రాష్ట్రాల్లో మాత్రమే మండళ్లు ఉన్నాయని చెప్పారు. గతంలో ఈ మండళ్ల పనితీరు కారణంగా అసోం, మధ్యప్రదేశ్, పంజాబ్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ఉపసంహరించుకున్నాయని సీఎం జగన్ వివరించారు.
“బిల్లులకు మండలిలో సవరణలు చేసి పంపించినప్పుడు వాటిని తప్పనిసరిగా పాటించాల్సిన అవసరమే లేనప్పుడు మండలితో పనేంటి? ప్రజలతో ఎన్నుకున్న శాసనసభ రూపొందించిన బిల్లులను తాత్కాలికంగా అడ్డుకోవడానికి ఉపయోగపడుతున్న ఇలాంటి మండలిని ఏమనాలి? దీని వల్ల కాలయాపన, ప్రజా ప్రయోజనాలకు విఘాతం కలగడం తప్ప ప్రజలకు దీని వల్ల జరిగే మేలు ఏమీలేదు. ప్రజాప్రయోజనం లేని మండలి ఇది” అని సీఎం జగన్ వ్యాఖ్యానించారు.
ఓటుకు కోట్లు ఇస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారని, తమ పార్టీ ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొనుగోలు చేసి.. రాజ్యాంగానికి తూట్లు పొడిచినప్పుడు ఎవరూ మాట్లాడలేదని అన్నారు. చంద్రబాబులా తాను ఆలోచిస్తే.. ఆయనకు ప్రతిపక్షనాయకుడి హోదా ఉండదని గతంలోనే చెప్పానని గుర్తు చేశారు. దిక్కుమాలిన రాజకీయాలు చేయడానికి తాము చట్టసభలకు రాలేదన్నారు. రాజకీయాలను మార్చడానికే అధికారంలోకి వచ్చామని చెప్పారు. మండలి రద్దు కోసమే సభ పెడుతున్నామని గురువారమే చెప్పామని, తాము ఎమ్మెల్సీలకు రూ.5 కోట్లు ఆఫర్ చేశామని ప్రచారం చేశారని జగన్ మండిపడ్డారు.