అమరావతి: ఏపీ శాసనమండలి రద్దు తీర్మానానికి అసెంబ్లీ ఆమోదం లభించింది. సీఎం జగన్ సభలో మండలి రద్దు తీర్మానం ప్రవేశపెట్టి చర్చ నిర్వహించారు. ఆపై, మండలి రద్దు తీర్మానంపై స్పీకర్ తమ్మినేని సీతారాం ఓటింగ్ నిర్వహించగా, సభలో ఉన్న అందరూ లేచి నిలబడ్డారు. మండలి రద్దు అయిన నేపథ్యంలో కౌన్సిల్ నుంచి మంత్రులుగా ప్రాతినిథ్యం వహిస్తున్న మోపిదేవి వెంకట రమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ సభలో పక్కన కూర్చోవాలని స్పీకర్ తమ్మినేని సూచించారు. అనంతరం మండలి రద్దు తీర్మానానికి మద్దతు ఇచ్చే వారు లేచి నిలబడాల్సిందిగా సూచించారు. దీంతో వైసీపీ ఎమ్మెల్యేలతో పాటు జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ లేచి నిలబడ్డారు.
అసెంబ్లీ సిబ్బంది సభ్యులను లెక్కించగా 133 మంది లెక్క తేలింది. వారందరూ మండలి రద్దుకు అనుకూలమని తేల్చారు. అయితే, టీడీపీ సభ్యులు ఎవరూ సభకు రాకపోవడంతో ఎవరూ లేచి నిలబడలేదు. ఇక వ్యతిరేకంగానూ, తటస్థంగానూ ఎవరూ లేకపోవడంతో.. సీఎం జగన్ ప్రతిపాదించిన శాసన మండలి రద్దు తీర్మానం నెగ్గిందని స్పీకర్ తమ్మినేని సీతారామ్ ప్రకటించారు. ఇకపై శాసన మండలి మనుగడలో ఉండబోదని చెప్పారు. నిబంధనల ప్రకారం సభకు హాజరైన వారిలో మూడింట రెండొంతుల మంది శాసనమండలిని రద్దు చేస్తూ అనుకూలంగా ఓటు వేయడంతో తీర్మానాన్ని ఆమోదిస్తున్నట్టు స్పీకర్ తెలిపారు. అనంతరం సభను నిరవధికంగా వాయిదా వేశారు. కాగా నేటి సభా సమావేశాలకు టీడీపీ దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఆమోదం పొందిన ఈ రద్దు తీర్మానాన్ని కేంద్రానికి పంపనున్నారు.
అంతకు ముందు.. మండలి రద్దు తీర్మానాన్ని సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రతిపాదించారు. ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని చర్చను ప్రారంభించారు. దీనిపై సభ్యులు తమ అభిప్రాయాలను తెలియజేశారు. శాసనమండలి సభ్యులు, కేబినెట్ మంత్రులు అయిన మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్లు కూడా శాసనమండలి రద్దుకు అనుకూలంగా మాట్లాడారు. చివరగా శాసనసభను ఉద్దేశించి సభానాయకుడు సీఎం జగన్ మోహన్ రెడ్డి మాట్లాడారు. ఏపీలో శాసనమండలిని రద్దు చేయడం గర్వంగా ఉందన్నారు. దేశంలోని 28 రాష్ట్రాల్లో కేవలం ఆరు రాష్ట్రాల్లోనే శాసనమండళ్లు ఉన్నాయని చెప్పారు.
ఇదిఇలా ఉంటే.. వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన రెండు ప్రతిష్టాత్మక బిల్లులు అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపాలని శాసనమండలి చైర్మన్ షరీఫ్ నిర్ణయించిన ఐదు రోజులకు కౌన్సిల్ను రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏపీ శాసనమండలిలో మొత్తం 58 మంది సభ్యులు ఉంటారు. ప్రస్తుతం టీడీపీకి 28, వైసీపీకి 9, పీడీఎఫ్ 5, నామినేటెడ్ 8, స్వతంత్రులు 3, బీజేపీకి 2 సభ్యులు ఉన్నారు. మూడు స్థానాలు ఖాళీగా ఉన్నాయి.