(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
కరోనా వైరస్ తొలిసారి బయటపడిన చైనా నగరం వుహాన్లో వైరస్ బాధితులు పిట్టల్లా రాలిపోతున్నారంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో తిరుగుతోంది. అది నిజానికి బూటకపు వీడియో అయినప్పటికీ వుహాన్లో పరిస్థితి ఘోరంగానే ఉంది. నగరంలోని ఒక వీధిలో సుమారు 60 ఏళ్ల వయసున్న ఒక వ్యక్తి మృతదేహం పడి ఉండగా తాను చూసినట్లు అక్కడ నుంచి ఎఎఫ్పి వార్తాసంస్థ రిపోర్టర్ తెలిపారు.
ఒక అరగంట తర్వాత పూర్తి స్థాయి రక్షణ సూట్లు ధరించిన వైద్య సిబ్బంది అంబులెన్స్లో వచ్చి ఆ మృతదేహాన్ని తీసుకువెళ్లినట్లు ఆ రిపోర్టర్ తెలిపారు. అతను ఏ కారణంతో చనిపోయిందీ ధృవీకరించుకునేందుకు ఎఎఫ్పి ప్రయత్నించింది కానీ కుదరలేదు. అధికారులెవ్వరూ ఆ వార్తాసంస్థ ప్రయత్నాలకు స్పందించలేదు.
కోటీ 10 లక్షల జనాభాతో ఎప్పుడూ రద్దీగా ఉండే పారిశ్రామిక నగరం వుహాన్ ఇప్పుడు స్మశానాన్ని తలపిస్తున్నది. ఆ నగరంలోని ఒక చేపల మార్కెట్లో జంతువుల నుంచి కరోనా వైరస్ మొట్టమొదటి సారిగా మనుషులకు సోకిందని అంచనా. వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు చైనా ప్రభుత్వం వుహాన్ నగరాన్ని దిగ్బంధించింది. లోపల నుంచి బయటకు, బయటనుంచి లోపలకు రాకపోకలు లేకుండా పూర్తిగా సీలు చేశారు.
ఫలితంగా నగరంలోని ప్రజలు కనీవినీ ఎరుగని ఇబ్బందులకు లోనవుతున్నారు. వంట్లో బాగోలేకపోతే చూపించుకునేందుకు ఆసుపత్రి దగ్గర 24 గంటలకు పైగా క్యూలో నుంచోవాల్సివస్తున్నది. నగరంలో రవాణా బంద్ కావడంతో ప్రజలు ఎక్కడకు వెళ్లాలన్నా నడిచి గానీ సైకిల్పై గానీ వెళుతున్నారు. ఆసుపత్రికి వెళ్లాల్సి వచ్చిన వారు అక్కడ ఎన్ని గంటలు ఎదురుచూడాల్సివస్తుందోనన్న భయంతో వెంట కుర్చీ తీసుకువెళుతున్నారు.
ఎఎఫ్పి రిపోర్టర్ కంట పడిన మృతదేహం పడిఉన్నది ఒక ఆసుపత్రి సమీపంలోనే. ఆ రిపోర్టర్ అక్కడే నుంచుని చూస్తుండగా కనీసం 15 అంబులెన్సులు అటుగా వెళ్లాయి. చివరికి కిటికీలు మూసిన అంబులెన్స్ ఒకటి వచ్చి ఆ మృతదేహాన్ని పసుపు రంగు సర్జికల్ బ్యాగ్లో దూర్చి తీసుకువెళ్లారు. వెంటనే సిబ్బంది శవం పడిఉన్న చోటును రసాయనాలతో శుభ్రం చేశారు.