అమరావతి : రాజధాని ఎంపిక మాత్రమే రాష్ట్రం ఇష్టం కానీ..మార్చడం కాదని టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. బుధవారం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఇతర జెఏసి నేతలతో కలసి అమరావతి ప్రాంతంలో రైతుల దీక్షా శిబిరాలను సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్బంగా జగన్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అమరావతి ప్రాంతాన్ని శ్మశానం, ఎడారి అంటే చాలా బాధేస్తోందని తెదేపా అన్నారు. అమరావతికి వరదలు వస్తాయనీ, రాజధాని మునిగిపోతుందనీ వైసీపీ నేతలు పదేపదే అవాస్తవాలు ప్రచారం చేశారనీ విమర్శించారు.
23 ఏప్రిల్ 2015న కేంద్రం విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఏపీ రాజధాని అమరావతి అని, ఈ విషయంలో రాష్ట్రాన్ని కేంద్రం ఎందుకు ప్రశ్నించడం లేదని చంద్రబాబు అన్నారు. చట్టాలను అమలు చేసే బాధ్యత ప్రభుత్వంపై ఉందని గుర్తు చేశారు. రాజధాని కోసం అమరావతి రైతుల పోరాటం చరిత్రలో నిలిచిపోతుందని చంద్రబాబు అన్నారు.
వైసీపీ ప్రభుత్వం వైఖరితో రాష్ట్రానికి రావాల్సిన సంస్థలన్నీ తిరిగి వెనక్కి వెళ్లిపోతున్నాయనీ, రాష్ట్ర అభివృద్ధి కుంటుపడిందనీ చంద్రబాబు అన్నారు. రైతుల పోరాటం తప్పనిసరిగా విజయం సాధిస్తుందని ఆయన ఆకాంక్షించారు. డిల్లీలో అమరావతి జె ఏ సి నాయకులు అందరినీ కలుస్తున్నారనీ, విశాఖ ప్రజలు కూడా అధికార వికేంద్రీకరణ కాదని, అభివృద్ధి వికేంద్రీకరణ కావాలని కోరుకుంటున్నారనీ చంద్రబాబు అన్నారు.