నెల్లూరు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి పరిపాలన తీరుపై సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఎంతో రాజకీయ భవిష్యత్తు ఉన్న జగన్మోహనరెడ్డి ఈ విధంగా పరిపాలన చేస్తారని తాను ఊహించలేదని అన్నారు. అధికారంలోకి రావడంతోనే నెగిటివ్ యాంగిల్లో ఆయన పాలన ప్రారంభమయ్యిందని విమర్శించారు. భవనాలు కూల్చివేత, పోలవరం ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్ ఇలా అన్ని వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవడం ప్రారంభించారన్నారు. రాజకీయ నాయకుల మధ్య తీవ్రమైన విబేధాలు ఉండవచ్చు గానీ కక్ష సాధింపు ధోరణిలు ఉండకూడదనీ ఆయన అన్నారు. చంద్రబాబుపై కక్షతో ప్రజలను, అధికారులను ఇబ్బందులు పెట్టే పరిస్థితులు కనబడుతున్నాయన్నారు.
ఐఆర్ఎస్ అధికారి కృష్ణకిషోర్పై ప్రభుత్వ కక్షసాధింపు సరికాదని హితవు పలికారు. అధికారంలో ఎవరు ఉంటే వారి ఆలోచనలకు అనుగుణంగా అధికారులు పని చేయడం సహజమనీ, పాలకులు తప్పుడు నిర్ణయాలు తీసుకున్నా తప్పనిసరి పరిస్థితిలో వాటిని అధికారులు అమలు చేయాల్సిన పరిస్థితులు ఉంటాయనీ ఆయన చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో జగతి పబ్లికేషన్లో తనిఖీలు నిర్వహించి నివేదిక అందజేసిన ఐఆర్ఎస్ అధికారి కృష్ణకిషోర్పై దాన్ని మనసులో పెట్టుకొని కక్షసాధింపు చర్యకు పూనుకోవడం మంచిపద్ధతి కాదన్నారు. దీని వల్ల అధికార పరిపాలనా విభాగం నిర్వీర్యం అవుతుందన్నారు. ఎన్నికలకు ముందు చంద్రబాబును ఇబ్బందులు పెట్టడానికి జగన్మోహనరెడ్డి కేసులో ఆయనతో పాటు జైలుకు వెళ్లివచ్చిన ఎల్వి సుబ్రమణ్యంకు బిజెపి ప్రభుత్వం సిఎస్ పదవి కట్టబెట్టలేదా అని ప్రశ్నించారు.
గత ప్రభుత్వం చేసిన తప్పులనే జగన్ ప్రభుత్వం చేస్తే భవిష్యత్తులో ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వస్తుందని సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ హెచ్చరించారు.