అమరావతి: రాజ్యాంగబద్దమైన చట్టసభల హక్కులను కాలరాయాలని చూడడం రాజ్యాంగాన్ని వ్యతిరేకించడమే అవుతుందని ఆంధ్రప్రదేశ్ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. సభ్యుల హక్కులను హరిస్తే రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుందని.. రాజ్యాంగాన్ని ఉల్లంఘించేలా ఎవరైనా వ్యవహరిస్తే చట్టం కచ్చితంగా తన పని తాను చేస్తోందని హెచ్చరించారు. ఆదివారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు.
‘చట్టసభలకు హాజరుకాకుండా నిరోధించడం రాజ్యాంగ విరుద్ధం. ఆందోళనకారులకు తమ నిరసన తెలుపుకొనే హక్కు ఉంటుంది. అయితే, అది నిబంధనలకు లోబడే ఉండాలి. చట్టసభ సభ్యులను సభకు రానివ్వకుండా అడ్డుకోవడం అంటే అది సభ్యుల హక్కులను హరించడమే. సభను నిర్వర్తించకుండా, ముట్టడికి పిలుపునివ్వడం అంటే సభ్యుల హక్కులను ఉల్లంఘించడమే. ఎవరైనా అలాంటి అవాంఛనీయ ఘటనలకు పాల్పడి, సభను అడ్డుకునే ప్రయత్నం చేస్తే వారిని జైలుకు పంపిన ఘటనలు గతంలో ఉన్నాయి’ అని తమ్మినేని సీతారాం వ్యాఖ్యానించారు. సభ్యులు ఎవరైనా సమస్యను అసెంబ్లీలో ప్రశ్నించవచ్చని సూచించారు. శాసనసభ నిబంధనల ప్రకారం సభ్యులు కాని వారు అసెంబ్లీ ప్రాంగణంలోకి రాకూడదని స్పష్టం చేశారు. అలా కాదని ఎవరైనా ముందుకొస్తే జైల్లో వేస్తామని వార్నింగ్ ఇచ్చారు. సభలను అడ్డుకోవాలని సీనియర్ సభ్యుడు చెబుతున్నారని, ఆయనకు కూడా పాఠాలు చెప్పాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు. అసెంబ్లీ పరిసరాల్లో ఎటువంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా చూడాలని పోలీసులని కోరినట్లు తెలిపారు. రైతులు ప్రభుత్వంతో చర్చించి సమస్య పరిష్కరించుకోవాలి సూచించారు. ప్రభుత్వం కూడా రైతులతో చర్చలు జరపాలని, సమస్యను పరిష్కరించాలని స్పీకర్ తమ్మినేని చెప్పారు.
కాగా, ఆంధ్రప్రదేశ్లో మూడు రాజధానుల అంశానికి ఆమోద ముద్ర వేసేందుకు సోమవారం ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఈ నేపథ్యంలోనే అమరావతి పరిరక్షణ జేఏసీ తరఫున అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారు. దీంతో అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.