కర్నూలు: ఏ రాష్ట్రానికైనా రాజధాని ఒక్కటే ఉంటుందనీ, న్యాయ రాజధాని, పరిపాలనా రాజధాని అన్న పేర్లు గతంలో ఏక్కడా వినలేదనీ బిజెపి నేత బైరెడ్డి రాజశేఖరరెడ్డి అన్నారు. మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకువచ్చిన వైసిపి ప్రభుత్వంపై ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. జగన్ దృష్టిలో విశాఖనే రాజధాని అని బైరెడ్డి అన్నారు. మూడు రాజధానులు అనేది ఒక నాటకం, నయవంచన అని విమర్శించారు. జిఎన్ రావు కమిటీ నివేదిక అనేది ఒక ఫార్స్ అని వ్యాఖ్యానించారు. ఎన్నికలకు ముందు నుండే వైజాగ్లో విజయసాయి రెడ్డి తిష్టవేసి కార్యక్రమాలను చక్కబెట్టారని బైరెడ్డి విమర్శించారు. ఏసి రూమ్లలో కూర్చుని రియల్టర్లు రాసి ఇచ్చిందే జీఎన్ రావు కమిటీ రిపోర్ట్ అని ఆయన వ్యాఖ్యానించారు. న్యాయ రాజధాని అనేది ప్రపంచంలో ఎక్కడా లేదని అన్నారు. తల వైజాగ్కు ఇచ్చి, తోక మీద వెంట్రుక రాయలసీమకు ఇస్తున్నారని ఆయన విమర్శించారు. కోస్తాంధ్రలో సీట్ల కోసమే నాడు జగన్ అమరావతికి ఆమోదం తెలిపారని బైరెడ్డి అన్నారు.
అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి పెట్టడానికి ఇదేమన్నా బొమ్మల కొలువా అని వ్యాఖ్యానించారు. ఒక సారి ఏర్పాటు అయిన రాజధానిని మరొక చోటకు తరలించాలనుకోవడం అవివేకమే అవుతుందన్నారు. ఇటువంటి నిర్ణయాలపై న్యాయస్థానాలు చూస్తూ ఊరుకోవని అన్నారు. మంత్రివర్గ నిర్ణయం తరువాత ప్రభుత్వం విడుదల చేసే జివోలు, నిర్ణయాలపై హైకోర్టు, సుప్రీం కోర్టుల్లో ఛాలెంజ్లు, పిటిషన్లు ఉంటాయని బైరెడ్డి చెప్పారు. ఇల్లు అలకగానే పండుగ కాదు, ముందుంది ముసళ్ల పండుగ అంటూ బైరెడ్డి వ్యాఖ్యానించారు. న్యాయస్థానాలు వాయించే మేళానికి జగన్ అండ్ కంపెనీ డ్యాన్స్ ఆడాల్సి ఉంటుందని బైరెడ్డి వ్యంగ్యంగా విమర్శించారు.
హైకోర్టు కాదు సుప్రీం కోర్టు ఇచ్చినా రాయలసీమ దరిద్రం పోదని అన్నారు. తమ ప్రాంతానికి నికర జలాలు, ఉద్యోగ అవకాశాలు, పెట్టుబడులు రావాలి, వలసలు అగాలి అప్పుడే రాయలసీమ అభివృద్ధి చెందుతుందని బైరెడ్డి పేర్కొన్నారు.