కరోనాకి అనేక దేశాలు వణికిపోతున్నాయి. దేశాల ఆర్థికం అతలాకుతలం అవుతున్నాయి. ప్రతి వైరస్ కి మూల కారణం చికెనే అంటూ ప్రచారం ముందు మొదలవుతుంది. దానికి కరోనా కూడా ఆజ్యం పోసింది. ఇంకేముంది దేశవ్యాప్తంగా చికెన్ అమ్మకాలు మందగించాయి. పౌల్ట్రీ పరిశ్రమ దెబ్బతింది. ఈ ప్రచారం అవాస్తవం అని తేల్చేందుకు తెలంగాణ మంత్రి కేటీఆర్ ముందుకొచ్చారు. బహిరంగంగా ఒక కార్యక్రమానికి హాజరై చికెన్ తిని, తాము రోజూ ఇంట్లో చికేనే తింటున్నాం…, ఏమి కాదు అందరూ తినండి అంటూ సెలవిచ్చారాయన. తెలంగాణ నాట నానాటికీ క్షీణిస్తున్న పౌల్ట్రీకి కాస్త ఊపు తెచ్చారు. అందుకే ఆయన కేటీఆర్ అయ్యారు. సరైన సమయంలో సరైన కార్యక్రమానికి మరో ముగ్గురు మంత్రులతో కలిసి హాజరై, మంచి సందేశాన్నిచ్చారు. అంటూ ఆయనకు ప్రశంసలు దక్కుతున్నాయి.
వారానికి రూ. వేయి కోట్లు దెబ్బ…!
కొన్నేళ్ళ కిందట చికెన్ గున్యా కి కారణం చికెన్ అంటూ చికెన్ తినడం మానేశారు. తర్వాత డెంగ్యూ కి కారణం చికేనే అంటూ తినడం ఆపేశారు. పాపం చికెన్ అంటే నోరు ఊరుతున్నా ప్రాణాంతక వ్యాధుల భయంతో పుకార్లు నమ్మి నెలల తరబడి చికెన్ మానేశారు. ఇప్పుడు కరోనా దెబ్బ కూడా చికెన్ కి పడింది. గడిచిన నెల రోజులుగా దేశవ్యాప్తంగా రూ. 5 వేల కోట్ల వరకు చికెన్ వ్యాపారులు నష్టపోయారు. వారానికి సగటున రూ. వేయి కోట్లు నష్టపోతున్నామని ఆ సంఘం ప్రతినిధులు పేర్కొంటున్నారు. ఇక చికెన్ ఉత్పత్తి, వినియోగం అధికంగా ఉన్న తెలుగు రాష్ట్రాల్లో వారానికి రూ. 120 కోట్లు వరకు నష్టం ఉంటుంది. కిలో ఉత్పత్తికి రూ. 75 ఖర్చు చేస్తుంటే మార్కెట్ లో కిలో రూ. 40 కి కూడా కొనడం లేదు. అందుకే ఈ నష్టాలు. దీని నుండి తెరుకోడానికి జాతీయ పౌల్ట్రీ పరిశ్రమ ప్రతినిధులు, NECC కలిపి వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. దీనిలో మంత్రి స్థాయిలో కేటీఆర్ పాల్గొని చికెన్ పై ఉన్న అపోహలు పోగొట్టారు. సోషల్ మీడియాలో ఊహాగానాలు నమ్మవద్దని కోరారు.
దేశానికి భయం లేదు.. కానీ అప్రమత్తత ముఖ్యం…!
కరోనా కారణంగా ప్రస్తుతానికి ఇండియాకి వచ్చిన ముప్పేమీ లేదు. అధికారికంగా ఇప్పటి వరకు అయిదు కేసులను మాత్రమే గుర్తించారు. ప్రతి విమానాశ్రయం, ప్రయాణ ప్రాంగణాల్లో తనిఖీలు ముమ్మరం చేశారు. ఆసుపత్రుల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. దేశంలో అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఇదే. అందుకే కేంద్ర ఆరోగ్య శాఖ సహా, అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు దీని నియంత్రణపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నాయి. ఈ వైరస్ కి చికిత్స తప్ప, పూర్తిగా తగ్గించే మందులు ఇంకా పరిశోధన దశలోనే ఉన్నాయి.